న్యూఢిల్లీ: ఇంట్లో పటాకులు తయారు చేస్తుండగా భారీ పేలుడు సంభవించి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హిమాన్షు (21) అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం తన ఇంట్లో పటాకులు తయారు చేస్తున్నాడు. అందుకోసం ముందుగా సల్ఫర్, పొటాస్ను మిక్స్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
ఈ పేలుడులో హిమాన్షుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో ఉన్న హిమాన్షును జగ్ పర్వేష్ చంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి హిమాన్షు మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఢిల్లీలో ఈ మధ్య వాయు కాలుష్యం తీవ్రమవుతుండటంతో అక్కడి ప్రభుత్వం ఈ దీపావళికి పటాకులపై నిషేధం విధించింది. పటాకులు తయారు చేయడంగానీ, నిలువ చేయడంగానీ, అమ్మడంగానీ, కొనడంగానీ, కాల్చడంగానీ చేయవద్దని ప్రభుత్వం తన నిషేధం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ క్రమంలో ఇంట్లో చాటుగా పటాకులు తయారు చేయబోయి వ్యక్తి మరణించాడు.