తొలి పోరులో అలవోకగా నెగ్గిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ పట్టేయాలని తహతహలాడుతున్నది! బౌలింగ్, బ్యాటింగ్ ఇలా ఏ విభాగంలో చూసుకున్నా వెస్టిండీస్ కన్నా రోహిత్ సేన బలంగా కనిపిస్తుండగా.. సిరీస్ను నిర్ణయాత్మక పోరు వరకు తీసుకెళ్లాలని కరీబియన్లు భావిస్తున్నారు. స్పిన్కు సహకరించనున్న పిచ్పై చాహల్, సుందర్ మరోసారి మ్యాజిక్ చూపిస్తే.. మిగిలినపని పూర్తి చేసేందుకు బ్యాటర్లు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నారు!
అహ్మదాబాద్: సఫారీ పర్యటనలో నిరాశాజనక ప్రదర్శన అనంతరం ఈ ఏడాది తొలి విజయాన్ని నమోదు చేసుకున్న టీమ్ఇండియా.. అదే ఊపులో స్వదేశంలో సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. మొదటి వన్డేలో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రోహిత్ సేన మరోసారి ఫేవరెట్గా బరిలోకి దిగుతుండగా.. భారత్ జోరుకు అడ్డుకట్ట వేయాలని విండీస్ యోచిస్తున్నది. మొదటి మ్యాచ్కు అందుబాటులో లేని లోకేశ్ రాహుల్ తిరిగి జట్టుతో చేరగా.. కరోనా నెగెటివ్ అని తేలడంతో శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ధవన్, అయ్యర్కు తుది జట్టులో తీసుకునే అవకాశాలు తక్కువ కాగా.. రోహిత్తో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేయడం దాదాపు ఖాయమే. గత మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన యువ వికెట్కీపర్ ఇషాన్ కిషన్ బెంచ్కే పరిమితం కాక తప్పకపోవచ్చు. వన్డౌన్లో విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా బ్యాటింగ్కు రానున్నారు. వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ రూపంలో ఇద్దరు ఆల్రౌండర్లు అందుబాటులో ఉండ గా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ భారం మోయనున్నారు. గత మ్యాచ్ జరిగిన పిచ్పైనే ఈ పోరు సాగనుండటంతో విండీస్ ఆటగాళ్లకు మన స్పిన్నర్లతో ముప్పు పొంచిఉన్నట్లే. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్రమోదీ మైదానంలో సత్తా చాటాలని విండీస్ పవర్ హిట్టర్లు భావిస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న నేపథ్యంలో వారు దీనిపైనే ఎక్కువ దృష్టి సారిస్తారనడంలో సందేహం లేదు.
కోలుకున్న ధవన్, అయ్యర్
విండీస్తో సిరీస్ ప్రారంభానికి ముందు కరోనా వైరస్ బారిన పడిన శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్ కోలుకున్నారు. తాజా పరీక్షల్లో వారికి కరోనా నెగెటివ్ అని తేలింది. దీంతో మంగళవారం జట్టు సభ్యులతో కలిసి వాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న వీరిద్దరూ బుధవారం తుది జట్టులో ఉండే అవకాశాలు తక్కువే. పూర్తిగా కోలుకునేంత వరకు బోర్డు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని భావిస్తున్నది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దీపక్ హుడా, సుందర్, శార్దూల్, సిరాజ్, చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ.
వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), హోప్, బ్రాండన్, బ్రావో, బ్రూక్స్, పూరన్, హోల్డర్, అలెన్, అకీల్, అల్జారీ, రోచ్.