1990లలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు చేసిన తప్పులనే ప్రస్తుతం టీమిండియా కూడా పునరావృతం చేస్తుందని పాక్ మాజీ సారథి రషీద్ లతీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. జింబాబ్వే పర్యటనకు శిఖర్ ధావన్ను సారథిగా నియమించి.. సీనియర్లకు విశ్రాంతినివ్వడంపై మాట్లాడుతూ రషీద్ ఇలా అన్నాడు. ఇంకెంతమంది సారథులను మారుస్తారని ఆయన ప్రశ్నించాడు.
జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడేందుకు గాను బీసీసీఐ రెండ్రోజుల క్రితమే జట్టును ప్రకటించింది. వెస్టిండీస్తో వన్డే సిరీస్ మాదిరిగానే జింబాబ్వేతో కూడా శిఖర్ ధావనే యువ భారత్ను నడిపించనున్నాడు. ఈ సిరీస్కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, కెఎల్ రాహుల్లను బీసీసీఐ ‘విశ్రాంతి’ పేరిట పక్కనబెట్టింది.
ఈ నేపథ్యంలో రషీద్ తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘అందరూ బ్యాకప్ కెప్టెన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే భారత జట్టులో విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఏడుగురు సారథులు మారారు. ఇలా జరగడం టీమిండియా క్రికెట్ చరిత్రలో ఇదే ప్రథమం. కోహ్లీ, రోహిత్, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్, బుమ్రా, శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా. చూస్తుంటే భారత్ కూడా 1990లలో పాకిస్తాన్ చేసిన తప్పే చేస్తున్నట్టుంది..’ అని అన్నాడు.
1990లలో పాకిస్తాన్ జట్టుకు కూడా వరుసగా సారథులు మారారు. ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్,వసీం అక్రమ్, వకార్ యూనిస్, సలీమ్ మాలిక్, రమీజ్ రాజా, సయూద్ అన్వర్, రషీద్ లతీఫ్, అమీర్ సొహైల్ లను మార్చి విమర్శల పాలైంది.