అంతా అనుకున్నట్లే జరిగింది. ముచ్చటగా మూడు రోజుల్లో ముగిసిన ఐదో టెస్టులో భారత్ విజయదుందుభి మోగించింది. దౌలాదర్ పర్వత శ్రేణుల్లో ఇంగ్లండ్ను మట్టికరిపిస్తూ టీమ్ఇండియా ఇన్నింగ్స్ తేడాతో భారీ గెలుపు అందుకుంది. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఐదు వికెట్లతో విజృంభించిన వేళ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 195 పరుగులకు కుప్పకూలింది. రూట్(84) ఒంటరిపోరాటం మినహా అందరూ పేలవ ప్రదర్శన కనబరిచారు. సిరీస్ను 4-1తో కైవసం చేసుకున్న భారత్ డబ్ల్యూటీసీ చాంపియన్షిప్లో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
Team India | ధర్మశాల: భారత్ సొంతగడ్డపై బెబ్బులిలా గర్జించింది. సీనియర్ల గైర్హాజరీలో ఏ మాత్రం తొణకని, బెణకని టీమ్ఇండియా..ఇంగ్లండ్ భరతం పట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 4-1తో కైవసం చేసుకుని ఔరా అనిపించింది. శనివారం రెండో ఇన్నింగ్స్కు దిగిన ఇంగ్లండ్..వందో టెస్టు ఆడుతున్న అశ్విన్(5/77) ధాటికి 195 పరుగులకే కుప్పకూలింది. మిడిలార్డర్ బ్యాటర్ జో రూట్(128 బంతుల్లో 84, 12 ఫోర్లు) ఒక్కడే పోరాటం చేయగా, బెయిర్స్టో(39) ఫర్వాలేదనిపించాడు. జాక్ క్రాలీ(0), డకెట్(2), కెప్టెన్ స్టోక్స్(2), బెన్ ఫోక్స్(8), మార్క్ వుడ్(0) తీవ్రంగా నిరాశపరిచారు. కుల్దీప్యాదవ్(2/40), బుమ్రా(2/38) రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 473/8తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 477 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్లు కుల్దీప్(30), బుమ్రా(20) తమ ఇన్నింగ్స్ను కొనసాగించలేకపోయారు. కుల్దీప్ను ఔట్ చేయడం ద్వారా అండర్సన్ టెస్టుల్లో 700 వికెట్ల ఫీట్ను చేరుకున్నాడు. షోయబ్ బషీర్(5/173) ఐదు వికెట్లతో రాణించగా, అండర్సన్(2/60), హార్ట్లే (2/126) రెండేసి వికెట్లు తీశారు. జైస్వాల్(712)కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’, కుల్దీప్యాదవ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కాయి.
దుబాయ్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భారత్ టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నది. ఇంగ్లండ్తో ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64పరుగుల తేడాతో గెలువడం ద్వారా టీమ్ఇండియా తమ పాయింట్ల శాతాన్ని 64.58 నుంచి 68.51కు పెంచుకుంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ చాంపియన్షిప్లో భారత్ ఆరు మ్యాచ్ల్లో గెలిచి రెండు ఓటములు, ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. యువ క్రికెటర్లతో సిరీస్ గెలిచి భారత్ టాప్లోకి దూసుకొచ్చిందని ఐసీసీ పేర్కొంది.
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్ అండర్సన్ అరుదైన రికార్డు అందుకున్నాడు. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో 700 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొలి పేసర్గా అండర్సన్ రికార్డుల్లోకెక్కాడు. భారత్తో ఐదో టెస్టులో కుల్దీప్యాదవ్ను ఔట్ చేయడం ద్వారా అండర్సన్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఓవరాల్గా టెస్టుల్లో మురళీధరన్(800), షేన్వార్న్(708) తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 218 ఆలౌట్,
భారత్ తొలి ఇన్నింగ్స్: 477 ఆలౌట్(గిల్ 110, రోహిత్ 103, బషీర్ 5/173, అండర్సన్ 2/60),
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195 ఆలౌట్ (రూట్ 84, బెయిర్స్టో 39, అశ్విన్ 5/77, బుమ్రా 2/38)