డబ్లిన్: ఫలితంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా.. మెగాటోర్నీలకు ముందు ప్రధాన ఆటగాళ్ల రీఎంట్రీకి ఉపయోగపడుతుందని భావించిన ఐర్లాండ్ టూర్లో బుధవారం చివరి మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. భారత్, ఐర్లాండ్ ఆఖరి టీ20లో తలపడనున్నాయి. గాయం కారణంగా దాదాపు ఏడాది కాలంగా జాతీయ జట్టుకు దూరమైన ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్తో ఘన పునరాగమనం చేశాడు. ఆడిన రెండు మ్యాచ్ల్లో రెండేసి వికెట్లు పడగొట్టిన బుమ్రా.. తన నాయకత్వ లక్షణాలతోనూ ఆకట్టుకున్నాడు.
ఇప్పటి వరకు సిరీస్లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన టీమ్ఇండియా.. ఆఖరి పోరులోనూ అదే జోరు కొనసాగించి సిరీస్ క్లీన్స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. ఆసియాకప్నకు ఎంపికైన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ ఆకట్టుకున్న తిలక్.. ఈ సిరీస్లోని రెండు మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. మరి మూడో మ్యాచ్లో తిలక్ ఏం చేస్తాడో చూడాలి.