వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు చెమటోడుస్తున్నారు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్పై కెప్టెన్ రోహిత్ శర్మ (5), ఓపెనర్ అవతారమెత్తిన రిషభ్ పంత్ (18), కోహ్లీ (18) పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే భారం కేఎల్ రాహుల్ (7 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(17 నాటౌట్)పై పడింది. వీరిద్దరూ చాలా ఆచితూచి ఆడుతున్నారు. దీంతో టీమిండియా స్కోరు బోర్డు చాలా నెమ్మదిగా ముందుకు సాగుతోంది.
సూర్యకుమార్ యాదవ్ అడపాదడపా ఫోర్లు కొడుతుండగా.. రాహుల్ పూర్తిగా డిఫెన్సివ్ ఆట ఆడుతున్నాడు. ఈ క్రమంలో భారత జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 68/3 స్కోరుతో నిలిచింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగుతున్న ఈ వన్డేకు విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ దూరమయ్యాడు. దీంతో నికోలస్ పూరన్ ఆ జట్టు సారధ్య బాధ్యతలు చేపట్టాడు. టాస్ గెలిచిన పూరన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.