భారత్ గెలుపు ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. వెస్టిండీస్తో రెండో టెస్టులో గెలిచి సిరీస్ క్లీన్స్వీప్ చేద్దామనుకున్న టీమ్ఇండియా అవకాశాలను వరుణుడు ఘోరంగా దెబ్బతీశాడు. విరామం లేని వర్షంతో క్వీన్స్పార్క్ ఓవల్ తడిసి ముద్దయ్యింది. వరుణుడు దోబూచులాడిన వేళ మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగా భారత్, విండీస్ మధ్య రెండో మ్యాచ్ ఎలాంటి ఫలితం లేకుండా డ్రా గా ముగిసింది. రెండు మ్యాచ్ల సిరీస్ను రోహిత్సేన 1-0తో దక్కించుకుంది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలనుకున్న భారత్ను వరుణుడు పదే పదే అడ్డుకున్నాడు. రెండు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టులో భారీ విజయం మూటగట్టుకున్న టీమ్ఇండియా.. రెండో మ్యాచ్లోనూ విజయానికి చేరువైంది. అయితే ఐదో రోజైన సోమవారం ఉదయం నుంచే ఎడతెరిపిలేని వర్షం క్వీన్స్పార్క్ ఓవల్ను ముంచెత్తింది. గడియకు ఒకసారి వర్షం పడుతూ ఆగిపోవడంతో ఆటకు తీవ్ర ఆటంకం కల్గింది.
పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆటకు అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్ను నిలిపివేశారు. మొదట రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులు చేయగా.. విండీస్ 255 పరుగులకు ఆలౌటైంది. అయితే రెండో ఇన్నింగ్స్లో టీమిండియా టీ20 తరహాలో దంచికొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 181/2 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన రోహిత్.. ప్రత్యర్థి ముందు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. భారీ ఛేదనలో విండీస్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ 438, వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 255, భారత్ రెండో ఇన్నింగ్స్: 181/2 డిక్లేర్డ్, వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 76/2