శ్రీలంక, భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) తమకు దక్కిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన విహారి (58), విరాట్ కోహ్లీ (45) ఇన్నింగ్స్ను నిలబెట్టారు.
కానీ స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ పెవిలియన్ చేరడంతో అభిమానుల్లో ఆందోళన కలిగింది. ముఖ్యంగా వందో టెస్టు ఆడుతున్న కోహ్లీ హాఫ్ సెంచరీ కూడా చేయకుండా పెవిలియన్ చేరడం వారికి నిరాశ కలిగించింది. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ (27) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. కానీ రిషభ్ పంత్ (96) జట్టును ఆదుకున్నాడు. జడేజా (45 నాటౌట్)తో కలిసి ఐదో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు.
వ్యక్తిగత సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో అవుటయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన అశ్విన్ (10 నాటౌట్) కూడా మంచి ఆటతీరు కనబరుస్తున్నాడు. ఈ క్రమంలో రెండో రోజు వీరిద్దరి ఆటే కీలకం కానుంది. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్డెనియా 2 వికెట్లు తీయగా సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, ధనంజయ డిసిల్వా తలో వికెట్ తీశారు.