IND vs SA: భారత్ – సౌతాఫ్రికా మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా నిర్దేశించిన 327 పరుగుల ఛేదనలో సఫారీలు ఆది లోనే కాడి ఎత్తేశారు. భారీ ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్ల లోపే 7 వికెట్లు కోల్పోయింది. చార్మినార్ ఎక్స్ప్రెస్ మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా వికెట్ల పతనాన్ని మొదలుపెట్టగా జడేజా, షమీలు సౌతాఫ్రికాకు వరుస షాకులిచ్చి సఫారీలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. ఆ జట్టులో డికాక్, బవుమా, మార్క్రమ్, క్లాసెన్, డసెన్, మిల్లర్లు పెవిలియన్కు చేరారు.
వరల్డ్ కప్లో ఇదివరకే నాలుగు సెంచరీలు బాది భీకరమైన ఫామ్లో ఉన్న సఫారీ ఓపెనర్ క్వింటన్ డికాక్ (5)ను తాను వేసిన తొలి ఓవర్లో మూడో బంతికే బౌల్డ్ చేసిన సిరాజ్ సౌతాఫ్రికాకు తొలి షాకిచ్చాడు. 19 బంతుల్లో 11 పరుగులు చేసిన సౌతాఫ్రికా సారథి టెంబా బవుమా (11)ను రవీంద్ర జడేజా బౌల్డ్ చేశాడు. ఇక ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్లలోనే 14 వికెట్లు తీసి అత్యంత ప్రమాదకరంగా బౌలింగ్ వేస్తున్న షమీ.. సౌతాఫ్రికా కష్టాలను మరింత రెట్టింపు చేశాడు. అతడు వేసిన పదో ఓవర్లో ఐదో బంతికి మార్క్రమ్ (9).. వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Jadejaaaa 🥶🔥💥💥 In Eden
The Best Doing, Whatt a Delivery
4th Wicket For Jaddu 🔥🔥🔥
SA 67/7#INDvSA pic.twitter.com/kq9pFSE5fi— VINEETH𓃵🦖 (@sololoveee) November 5, 2023
11 బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేసిన హెన్రిచ్ క్లాసెన్ ను రవీంద్ర జడేజా 13వ ఓవర్లో ఐదో బంతికి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో సఫారీలు నాలుగో వికెట్ కోల్పోయారు. ఇక షమీ వేసిన 14వ ఓవర్లో తొలి బంతికే వాండెర్ డసెన్ (13) కూడా ఎల్బీగా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా బోలెడన్ని ఆశలు పెట్టుకున్న డేవిడ్ మిల్లర్ (11) కూడా తన సహచరుల బాటే పట్టాడు. మిల్లర్ను 17వ ఓవర్లో జడ్డూ క్లీన్ బౌల్డ్ చేశాడు. సఫారీ పతనాన్ని మరింత వేగం చేస్తూ జడ్డూ.. 19వ ఓవర్లో నాలుగో బంతికి కేశవ్ మహారాజ్ను బౌల్డ్ చేశాడు. 19 ఓవర్లు ముగిసేటప్పటికీ సఫారీలు ఏడు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేశారు.