ప్రపంచ క్రికెట్లో అందరూ చూడాలనుకునే పోటీ దాయాదుల పోరే. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటే.. అది వ్యూయర్షిప్ రికార్డులు తిరగరాస్తుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా జరిగిన మ్యాచ్ దీనికి ఉదాహరణ. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఆటగాడు రమీజ్ రాజా.. క్రికెట్లో ఆ దేశం ప్రతిష్టను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఆ క్రమంలోనే ఆస్ట్రేలియాను పాక్ పర్యటనకు తీసుకెళ్లాడు. స్వదేశంలో పలు సిరీసులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలం క్రితం రమీజ్ రాజా మాట్లాడుతూ.. భారత్-పాక్ మ్యాచులు అభిమానులు చూడాలనుకుంటున్నారని అన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇండియాతో నాలుగు దేశాల మధ్య ప్రతి ఏటా టోర్నీలు నిర్వహించాలనే ప్రతిపాదన చేశాడు. దీనిపై తమకు ఆసక్తి లేదని బీసీసీఐ చెప్పేసింది.
ఇప్పుడు తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీఈవో నిక్ హాక్లీ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్ మధ్య త్రైపాక్షిక సిరీస్ పెట్టాలని తాము కూడా కోరుకుంటున్నామని, భవిష్యత్తులో ఈ సిరీస్ జరిగితే తమ దేశంలో నిర్వహించడానికి సిద్ధంా ఉంటామని చెప్పాడు. వ్యక్తిగతంగా తనకు త్రైపాక్షిక సిరీసులంటే ఇష్టమని, గతంలో ఇలాంటి సిరీసులు సక్సెస్ అయ్యాయని అన్నాడు.