మరికొన్ని రోజుల్లో పొట్టి ప్రపంచకప్ వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిదీ ఆడతాడా? లేదా? అని కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా షహీన్ మోకాలికి గాయమైంది. ఈ కారణంగా జట్టుకు దూరమైన అతను ఆసియా కప్లో కూడా ఆడలేదు.
ఇటీవలే లండన్లో చికిత్స చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా మాట్లాడుతూ.. భారత్తో మ్యాచ్కు షహీన్ సిద్ధంగా ఉన్నాడని ప్రకటించాడు. ‘షహీన్తో మాట్లాడా. తను చాలా గొప్పగా ఫీలవుతున్నట్లు షహీన్ చెప్పాడు. ప్రస్తుతం 90 శాతం ఫిట్గా పరిగెత్తుతున్నాడు. భారత్తో మ్యాచ్ నాటికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని షహీన్ చెప్పాడు’ అని రమీజ్ రజా వెల్లడించాడు.
అలాగే ఈ మ్యాచ్ కన్నా ముందు కొన్ని ప్రాక్టీస్ మ్యాచులు ఆడాలని కూడా షహీన్ అనుకుంటున్నట్లు తెలిపాడు. గత టీ20 ప్రపంచకప్ సమయంలో భారత్, పాక్ మ్యాచ్లో టీమిండియా టాపార్డర్ను షహీన్ దెబ్బకొట్టాడు. రోహిత్, రాహుల్ ఇద్దరినీ త్వరగానే పెవిలియన్ చేర్చడంతో భారత జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది.