IND vs PAK | ఈ ఏడాది వరల్డ్ కప్ భారత్ వేదికగా అక్టోబర్ – నవంబర్ వేదికగా జరుగనున్నది. అక్టోబర్ 15న భారత్ – పాక్ మధ్య కీలకమైన మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. దాయాదుల సమరంపై ఇరుదేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు జట్లకు సంబంధించిన బలబలాలపై స్పందిస్తున్నారు. తాజాగా పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టోర్నీలో పాక్ టైటిల్ ఫేవరెట్ అని అభిప్రాయపడ్డాడు. భారత బౌలింగ్ బలహీనంగా ఉందని వ్యాఖ్యానించాడు.
పాక్లా ఎప్పుడూ భారత బౌలింగ్ పదునుగా లేదని పేర్కొన్నాడు. బౌలింగ్ లైనప్ బలహీనంగా ఉందని, ఈ మధ్యకాలంలో సిరాజ్ మాత్రమే బాగా బౌలింగ్ చేశాడు. షమీ బాగా బౌలింగ్ చేస్తున్నాడని, స్పిన్నర్లలో రవీంద్ర జడేజా ప్రపంచకప్లో కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. జస్ప్రీత్ బుమ్రా పాకిస్తాన్కు ముప్పుగా మారే ప్రమాదం ఉందని, అయితే, చాలాకాలంగా అన్ఫిట్గా ఉన్నాడని.. ఈ పరిస్థితుల్లో భారత బౌలింగ్తో పాక్కు పెద్దగా ముప్పు వాటిల్లడం లేదని భావించడం లేదన్నాడు. భారత్ – పాక్ ప్రపంచకప్ మ్యాచ్పై స్పందిస్తూ.. తమ జట్టుకే 60శాతం గెలిచే అవకాశం ఉందని అజ్మల్ తెలిపాడు.
భారత్ను తక్కువ స్కోరుకే పరిమితం చేస్తే పాక్ విజయం సాధిస్తుందని పేర్కొన్నాడు. పాక్ జట్టే టైటిల్ ఫేవరెట్ అని చెప్పాడు. ఇదిలా ఉండగా.. ప్రపంచకప్లో పాక్పై భారత్ పైచేయి కొనసాగుతున్నది. విశ్వకప్లో ఇరు జట్లు మొత్తం ఏడుసార్లు తలపడ్డాయి. 2019 ప్రపంచకప్లో చివరిసారిగా ఇరు జట్లు తలపడగా, డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 140, కెప్టెన్ విరాట్ కోహ్లీ 77 పరుగులు చేశారు.
కేఎల్ రాహుల్ 57 పరుగులు చేశాడు. అనంతరం పాక్ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫఖర్ జమాన్ 62 పరుగులు, బాబర్ ఆజం 48 పరుగులు చేశారు. ఇమాద్ వసీం 46 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. భారత్ తరఫున విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఓవరాల్ రికార్డు గురించి చెప్పాలంటే.. భారత్-పాకిస్థాన్ జట్లు వన్డేల్లో 132 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 55 మ్యాచుల్లో గెలుపొందగా, పాకిస్థాన్ 73 మ్యాచుల్లో విజయం సాధించింది. నాలుగు మ్యాచ్ల్లో ఫలితం కనిపించలేదు.