CWC 2023: ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమిండియా స్వదేశంలో కప్ గెలిచే అవకాశాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగడం వల్లే భారత్ ఓడిపోయిందని, కోల్కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గానీ ముంబైలోని వాంఖెడేలో గానీ జరిగితే టీమిండియా వరల్డ్ కప్ గెలిచుండేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దేశం మొత్తాన్ని కాషాయమమయం చేయాలనుకునే కార్యక్రమంలోనే భాగంగా బీజేపీ అహ్మదాబాద్లో ఈ మ్యాచ్ నిర్వహించిందని విమర్శలు గుప్పించారు.
కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మమతా మాట్లాడుతూ.. ‘వాళ్లు దేశం మొత్తాన్ని కాషాయమయం చేయాలనుకున్నారు. మనం భారత జట్టును చూసి గర్వపడాలి. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ గనక కోల్కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో గానీ ముంబైలోని వాంఖెడే లో గానీ నిర్వహించిఉంటే మనం వరల్డ్ కప్ గెలిచేవాళ్లం..’ అని తెలిపారు.
VIDEO | “If (World Cup) final would have been in Eden Gardens (Kolkata) or Wankhede (Mumbai), we would have won the match,” said West Bengal CM @MamataOfficial in Kolkata. pic.twitter.com/WHIEBcs5VO
— Press Trust of India (@PTI_News) November 23, 2023
అంతేగాక టీమిండియా ప్రాక్టీస్ జెర్సీలను కాషాయమం చేసిన బీజేపీ.. జట్టు జెర్సీని కూడా కాషాయంగా మార్చాలని కుట్రలు చేసిందని ఆరోపించారు. ‘వాళ్లు టీమిండియా ప్రాక్టీస్ జెర్సీలను కాషాయమయం చేశారు. అంతేగాక మ్యాచ్లో ధరించే జెర్సీలను కూడా అదే విధంగా మార్చాలనుకున్నారు. కానీ మన ఆటగాళ్లు అందుకు ప్రతిఘటించడంతో ప్రాక్టీస్ జెర్సీలకే పరిమితమయ్యారు..’ అని అన్నారు.