Airport Metro | సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో మెరుగైన, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రెండోదశ మెట్రో ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఎయిర్పోర్టు మార్గాన్ని ఇప్పటికే మొదటి దశలో నిర్మించిన మూడు మెట్రో కారిడార్లను కలుపుతూ నిర్మించేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. అలాగే ఇన్నర్ రింగు రోడ్డుపై మూడు చోట్ల ఇంటర్చేంజ్ స్టేషన్లను నిర్మించనున్నారు. ఇందుకోసం పట్టణ ట్రాఫిక్ నిపుణులతో ప్రత్యేకంగా సర్వే చేయించి, ఏ సమయంలో ఎక్కడెక్కడ ఎంత ట్రాఫిక్ రద్దీ ఉన్నది. దానికి పరిష్కారంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నదానిపై ఇప్పటికే హైదరాబాద్ మెట్రో అధికారులు సర్వే చేపట్టారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి స్వయంగా ఇన్నర్ రింగురోడ్డు మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కి.మీ నడుచుకుంటూ వెళ్లి.. మెట్రో స్టేషన్లకు అనువైన ప్రాంతాలను గుర్తించారు.
ఇందులో భాగంగానే మొదటి దశలో మెట్రో ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మూడు కారిడార్ మియాపూర్-ఎల్బీనగర్( కారిడార్-1), జేబీఎస్-ఫలక్నుమా-చాంద్రాయణగుట్ట(కారిడార్-2), నాగోల్-రాయదుర్గం(కారిడార్-3) మెట్రో మార్గాలను కొత్తగా నిర్మించే ఎయిర్పోర్టు మెట్రో మార్గానికి అనుసంధానం చేసేందుకు అత్యంత అనుకూలమైన ప్రాంతాలను గుర్తించారు. అలాగే ఇన్నర్ రింగు రోడ్డుపై కొత్తగా నిర్మించాలని ప్రతిపాదించిన ఎయిర్పోర్టు మెట్రో మార్గంలో మూడు అత్యంత కీలకమైన జంక్షన్లను గుర్తించారు. వీటిలో నాగోల్ మూసీ నది పక్కన ఉప్పల్భగాయత్ లేఅవుట్ దగ్గర ప్రారంభమయ్యే ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్ అటు ఇప్పటికే ఉన్న నాగోల్ మెట్రో స్టేషన్ను కలుపుతుంది. మూసీ నది పొడవునా చేపట్టే ఈస్ట్-వెస్ట్ కారిడార్తోనూ కలుస్తుంది. కారిడార్-3 సైతం దీనికి అనుసంధానం అవుతుంది. ఇదిలా ఉంటే, ఎల్బీనగర్ జంక్షన్లో ఇప్పటికే కారిడార్-1 మెట్రో మార్గం ఉండటంతో దానికి అనుసంధానం చేస్తూ మరో మెట్రో స్టేషన్ను నిర్మించి స్కైవాక్లతో రెండు మెట్రో స్టేషన్లను అనుసంధానం చేయనున్నారు. ఇక చాంద్రాయణ గుట్ట వద్ద కలిసే కారిడార్-2తో ఎయిర్పోర్టు మెట్రో మార్గాన్ని అనుసంధానం చేసేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. శ్రీశైలం హైవే వైపు వెళ్లే చోట ఫ్లై ఓవర్ ఉండటంతో అనువైన స్థలం ఎంపిక సవాలుగా మారిందని, అయినా పలు కోణాల్లో అధ్యయనం చేసి ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్ను నిర్మిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.