చండ్రుగొండ, ఏప్రిల్ 28: పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే ఈ పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీ ఖాయమని ఖమ్మం ఎంపీ, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులన్నీ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలకు కొద్దిరోజుల సమయమే ఉన్నందున శ్రేణులన్నీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని, ఇంటింటికీ వెళ్లి గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమ పథకాలను వివరించాలని పిలుపునిచ్చారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాల్సిన ఆవశ్యకతను వివరించాలని కోరారు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం తుంగారం గ్రామంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకమని అన్నారు. పార్టీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసి మెలిసి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు కాంగ్రెస్ చేసిన అబద్ధపు వాగ్దానాలను, గెలిచిన తరువాత చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
తెలంగాణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కృషిని, గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని ప్రజలకు విశదీకరించాలన్నారు. అలాగే, కాంగ్రెస్ ఎన్నికల హమీలపై ఆ పార్టీ నాయకులను అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. స్థానికుడు కాని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించినప్పుడే కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని అంగీకరించిందని ఎద్దేవా చేశాడు. సమావేశంలో బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు దిండిగాల రాజేందర్, లక్కినేని సురేందర్రావు, కొణకండ్ల వెంకటరెడ్డి, నరుకుళ్ల సత్యనారాయణ, దారా వెంకటేశ్వరరావు, సంగొండి రాఘవులు, సూర వెంకటేశ్వరరావు, భూపతి రమేశ్, గాదె లింగయ్య, మేడా మోహన్రావు, గుగులోత్ శ్రీనివాస్నాయక్, నల్లమోతు వెంకటనారాయణ, మంద అనిల్, గుగులోత్ రమేశ్, కళ్లెం వెంకటేశ్వర్లు, ఉన్నం నాగరాజు, సత్తి నాగేశ్వరరావు, గుగులోత్ ప్రవీణ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.