World Cup 2023 : ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ(Virat Kohi), కేన్ విలియమ్సన్(Kane Williamson) ఇద్దరూ ఇద్దరే. ఒకరేమో మైదానంలో చిరుతను తలపిస్తే.. మరొకరు మౌన మునిలా ఆకట్టుకుంటారు. సమకాలీన క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లుగా వెలుగొందుతున్న విరాట్, విలియమ్సన్.. తమ సంప్రదాయ క్రికెట్ షాట్లతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నారు. మైదానంలో ప్రత్యర్థులుగా ఎన్నో మ్యాచుల్లో ఎదురుపడిన ఈ ఇద్దరూ.. మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఇద్దరూ తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు.
ముంబైలోని వాంఖడేలో సెమీఫైనల్లో భారత్ గెలుపొందాక కోహ్లీ, తన మిత్రుడు విలియమ్సన్ను ప్రేమగా హత్తుకున్నాడు. ఆ సీన్ చూసిన ప్రతిఒక్కరికి 2019 సెమీస్ ఓటమి అనంతరం కోహ్లీని కేన్మామ హత్తుకున్న దృశ్యం కండ్ల ముందు తిరిగింది. ఐసీసీ 2019 సెమీస్, 2013 సెమీస్లో ఈ దిగ్గజ క్రికెటర్లు ఒకరినొకరు ఓదార్చుతున్న ఫొటోలను కలిపి ఒక పోస్ట్ పెట్టింది. క్షణాల్లో ఆ పోస్ట్ వైరల్ అయింది.
అయితే.. 2007-08 అండర్ 19 వరల్డ్ కప్ నుంచి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. అప్పుడు కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్లో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా 3 వికెట్ల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. ఆ తర్వాత ఇద్దరూ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. 2019 వరల్డ్ కప్లో విలియమ్సన్, కోహ్లీ సారథులుగా మరోసారి ఎదురుపడ్డారు. అయితే.. ఈసారి ఫలితం మారింది. కివీస్ 18 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. మ్యాచ్ అనంతరం విలియమ్సన్ తన స్నేహితుడు కోహ్లీని కౌగిలించుకొని ఓదార్చాడు.
వరల్డ్ కప్ లీగ్ దశలోనే న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించిన భారత్.. సెమీస్లోనూ అదే ఫలితాన్ని రాబట్టింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా స్టార్ పేసర్ షమీ 7 వికెట్లతో చెలరేగగా.. 70 పరుగుల తేడాతో రోహిత్ సేన జయకేతనం ఎగరవేసింది. తొలుత విరాట్ కోహ్లీ(117) శతకాల అర్ధ సెంచరీతో విరుచుకుపడగా.. శ్రేయాస్ అయ్యర్(105) విధ్వంసక శతకాలతో రెచ్చిపోయాడు.. దాంతో, భారత్ కివీస్ ముందు 398 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. విలియమ్సన్(69), డారిల్ మిచెల్(134) మూడో వికెట్కు విలువైన రన్స్ జోడించారు. 33వ ఓవర్లో షమీ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి కివీస్ను దెబ్బకొట్టాడు. షమీ 7 వికెట్లతో విజృంభించడంతో కివీస్ 327 పరుగులకే కుప్పకూలింది.