Free Biryani | టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్లో సెంచరీతో కదం తొక్కాడు. వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్లో 50వ సెంచరీ చేసి సచిన్ రికార్డును అదిగమించాడు. ఓ అభిమాని బిర్యానీని ఫ్రీగా పంచి విరాట్ కోహ్లీ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. యూపీలోని బహ్రైచ్ జిల్లాలో ఓ బిర్యానీ దుకాణదారుడు ఉచితంగా బిర్యానీ పంపిణీ చేయగా పెద్ద ఎత్తున జనం బారులు తీరారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులతో పాటు, పాదచారులు ఆందోళన చెందారు.
కొత్వాలినగర్లోని టికోనిబాగ్ చౌకీలో ప్రాంతంలో బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు భారత్-న్యూజిలాండ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తుండడంతో సెంచరీ చేస్తే ఉచితంగా బిర్యానీ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్లో విరాట్ సెంచరీ చేయడంతో ఫ్రీ బిర్యానీ కోసం జనం ఎగబట్టారు. టికోనిబాగ్ చౌక్లో పెద్ద ఎత్తున జనం హోటల్ వద్ద బారులు తీరారు. ఒకరి తర్వాత ఒకరు భారీగా రావడంతో కొద్దిసమయంలోనే ట్రాఫిక్ జామ్ అయ్యింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. అయితే, ఫ్రీ బిర్యానీ ప్రకటనతో హోటల్ ఆపరేటర్కు ఇబ్బందికరంగా మారింది. మరి ఇంత పెద్ద ఎత్తున బిర్యానీ కోసం వస్తారని మాత్రం ఊహించలేదు.