K.Laxman | చెప్పేటోనికి వినేటోడు లోకువ అని పెద్దలుఊరికే అన్లేదు. డబుల్ ఇంజిన్ పార్టీ నేతలకు ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. వీళ్లు చెప్పేవి వింటే అసలు ఈ నాయకులు సోయి ఉండే మాట్లాడుతున్నారా? అనే అనుమానం కలగకమానదు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది ఒక్క నరేంద్ర మోదీ వల్లనే సాధ్యమవుతుందట. ఎంత గొప్ప మాట చెప్పారు. హవ్వ, ఇంతకంటే జోక్ ఇంకేదైనా ఉంటుందా?. ఏ చోటా మోటా నాయకుడో ఈ మాట అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభలో ఆ పార్టీ పక్షం నాయకుడిగా పని చేసిన అపార రాజకీయ అనుభవం కలిగిన డాక్టర్ లక్ష్మణ్ నోట జారువాలిన ముత్యాలు కావడమే ఆశ్చర్యం!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఓ ఘోరమైన తప్పిదంగా భావించే నరేంద్ర మోదీ రాష్ర్టాన్ని ఉద్ధరిస్తారా? తల్లిని చంపి బిడ్డను బతికించారని లోక్సభ సమావేశాల్లో ప్రతిసారీ అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి డైలాగులతో తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేస్తూ అక్కసును వెళ్లగక్కే మోదీ తెలంగాణను అభివృద్ధి చేస్తారా? అబ్బా, ఇంతటి ఆలోచన మీకుగాక ఇంకెవరికైనా కలలో అయినా తడుతుందా? ఈ మాట అనడానికి ముందు జరంత మొహమాటం అయినా అడ్డురాలేదా? చెప్పేటోడు చెబితే వినేటోనికైనా కనీస ఇంగితం ఉంటుందని అనిపించలేదా? తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనముగాక కొనమని అన్నదెవరు? మీ వాళ్లకు నూకలు తినడం నేర్పించమని ఉచిత సలహా ఇచ్చిఅవమానించిందెవరు? అంతెందుకు, ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చారా? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడికిపోయింది? విభజన హామీలను కాకి ఎత్తుకుపోయిందా? ఇన్ని రకాలుగా అన్యాయం చేసి, సందు దొరికినప్పుడల్లా అవమానించి, అవహేళన చేసిన ఆయన తెలంగాణను అభివృద్ధి చేస్తారా? లక్ష్మణ్జీ… ఏదన్నా అంటే అన్నారంటారు కానీ, ఏదిబడితే అది మాట్లాడే ముందు జరసోచాయించాలె. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అనుకుంటే ఎట్ల కాకా?!
– వెల్జాల