T20 World Cup 2024 : వన్డే ప్రపంచ కప్ ముగియడంతో ఇక అన్ని జట్లు పొట్టి ప్రపంచ కప్(T20 World Cup 2024) మీద ఫోకస్ పెట్టాయి. ఈమధ్యే ముగిసిన ఆఫ్రికా క్వాలిఫయర్(Africa Qualifier 2023)తో చివరి రెండు బెర్తులు కూడా ఖరారయ్యాయి. 20 జట్లు పోటీపడనున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది జూన్లో జరుగనుంది. దాంతో, ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఐసీసీ కొత్త లోగోను విడుదల చేసింది.
దీని ప్రత్యేకత ఏంటంటే..? పొట్టి ఫార్మాట్ను ప్రతిబింబించేలా ఆ లోగోను రూపొందించారు. లోగోపై క్రికెట్ బ్యాట్, బాల్తో పాటు ఆటగాళ్ల ఎనర్జీని సూచించే సంకేతం ఉంది. ప్రస్తుతం ఈ కొత్త లోగో నెట్టింట ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ పోటీలకు 20 జట్లు అర్హత సాధించాయి.
ఆ జట్లు ఏవంటే..? భారత్, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, కెనడా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఒమన్, పాకిస్తాన్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఉగాండా, వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
ఐసీసీ 2007లో మొదటిసారి టీ20 వరల్డ్ కప్ను ప్రవేశపెట్టింది. ఆ ఏడాది ఎంఎస్ ధోనీ సారథ్యంలోని యువ భారత్ చాంపియన్గా అవతరించింది. ఇక నిరుడు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన పొట్టి ప్రపంచ కప్లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. టైటిల్ పోరులో బట్లర్ సేన పాకిస్థాన్ను ఓడించి రెండోసారి పొట్టి ప్రపంచ కప్లో ఎగరేసుకుపోయింది.