ODI WC 2023 : ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్(ICC ODI World Cup qualifiers) పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 10 స్థానాలకుగానూ 8 జట్లు అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల కోసం మాత్రం పది జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో ఒకప్పటి మేటి జట్టు వెస్టిండీస్, గత ఏడాది ఆసియా కప్ విజేత శ్రీలంక జట్టు, సంచలనాలకు కేరాఫ్ అయిన జింబాబ్వే కూడా ఉన్నాయి. దాంతో అర్హత పోటీలు ఆస్తక్తికరంగా మారాయి.
జూన్ 18వ తేదీ నుంచి జింబాబ్వేలో వరల్డ్ కప్ క్వాలిఫైయర్ పోటీలు మొదలుకానున్నాయి. హరారే స్పోర్ట్స్ క్లబ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, టకషింగ క్రికెట్ క్లబ్.. ఈ మూడు స్టేడియాల్లో మ్యాచ్లు జరగున్నాయి. ‘ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ కౌంట్డౌన్ తుది అంకానికి చేరింది. వన్డే క్రికెట్లో అత్యుత్తమమైన ఈ టోర్నీకి అర్హత సాధించేందుకు పది జట్లకు ఇదొక మంచి అవకాశం అని’ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లర్డైస్(Geoff Allardice) తెలిపాడు. ఐసీసీ ఈమధ్యే క్వాలిఫైయర్ షెడ్యూల్ విడుదల చేసింది.
వరల్డ్ కప్ 2023 అర్హత పోరు పట్టిక
ఐసీసీ మెగా టోర్నీ అయిన వన్డే వరల్డ్ కప్ అర్హత కోసం ఈసారి ఎన్నడూ లేనంత పోటీ ఉంది. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే వంటి పెద్ద జట్లతో పాటు నేపాల్, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వంటి చిన్న జట్లు ఈ పోటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. పది టీమ్లను 5 చొప్పున రెండు గ్రూప్లుగా విభజిస్తారు.
గ్రూప్ ఏ – వెస్టిండీస్, జింబాబ్వే, నేపాల్, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
గ్రూప్ బి- శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
ప్రతి గ్రూప్ నుంచి టాప్- 3లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు వెళ్లాయి. సూపర్ సిక్స్లో అద్భుత ప్రదర్శన చేసిన రెండు టీమ్లు జూలై 9న హారారే స్పోర్ట్స్ క్లబ్లో ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. ఫైనల్ చేరిన రెండు జట్లు 2023 వరల్డ్ కప్ టోర్నీకి క్వాలిఫై అవుతాయి.
సొంతగడ్డపై 2011లో వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా
సొంత దేశంలో క్వాలిఫైయర్ పోటీలు జరగుతుండడం జింబాబ్వేకు కలిసిరానుంది. అయితే… మాజీ చాంపియన్లు వెస్టిండీస్, శ్రీలంక నుంచి ఆ జట్టకు గట్టి పోటీ ఎదురుకునుంది. ఐర్లాండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లు తమదైన రోజున ఎలాంటి ప్రత్యర్థికైనా షాక్ ఇవ్వగలవని ఇప్పటికే నిరూపించాయి. ఒకప్పటి పెద్ద జట్లు వరల్డ్ కప్ టోర్నమెంట్కు అర్హత సాధిస్తాయా? లేదా వీటికి షాకిచ్చి చిన్న జట్లు ఛాన్స్ కొట్టేస్తాయా? అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ ఇప్పటికే వరల్డ్ కప్కి క్వాలిఫై అయ్యాయి. ఈఏడాది భారతదేశం వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబర్ – నవంబర్ మధ్యలో వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. సొంత గడ్డపై 2011లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియా కప్పు ఎగరేసుకుపోయింది. భారత జట్టు ఈసారి కూడా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది.