Brijbhushan Singh | భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులు ఆరోపణలు చేయగా.. ఇప్పటికే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీ ఎంపీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో బ్రిజ్ భూషణ్ మహిళా రెజర్లను మంథరతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా తనను తాను శ్రీరాముడితో పోల్చుకున్నారు.
తన పార్లమెంటరీ నియోజకవర్గం గోండాలోని ధనైగంజ్ బంధేలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథర.. శ్రీరాముడిని 14 సంవత్సరాల పాటు వనవాసానికి పంపిందని, కానీ.. రాముడు అజ్ఞాతవాసానికి వెళ్లపోతే చాలా విషయాలు అసంపూర్ణంగా ఉండిపోయేవి అన్నాడు. రాముడు ఎప్పుడూ కేవత్ (గుహుడు)ని కలిసేవాడు కాదని, శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను తినేవాడు కాదని, హనుమంతుడు, సుగ్రీవులతో స్నేహం చేయలేకపోయావాడని.. చివరకు దుష్టుడైన రావణుడి అంతం ఎలా జరిగేది? అన్నారు. దైవం తన కోసం వేరే పనని అప్పగించాడని భావిస్తున్నానన్నాడు.
ఇదిలా ఉండగా.. నిన్న నార్కో టెస్ట్ డిమాండ్పై స్పందిస్తూ దానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే, రెజ్లర్లు సైతం సిద్ధంగా ఉండాలని బ్రిజ్ భూషణ్ డిమాండ్ చేశారు. దీనికి రెజ్లర్లు స్పందిస్తూ నార్కో టెస్ట్కు తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ను అరెస్టు చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.