CWC 2023: అందరూ టీ20లకు అలవాటుపడ్డారు.. ఇక వన్డేల మనుగడ కష్టమేనేమో..? ఇంగ్లండ్ బజ్బాల్ ఆటతో టెస్టులకు పూర్వ వైభవం వచ్చిందిగా, ఇక వన్డే ఫార్మాట్ కథ ముగిసినట్టే..! ఇదే చివరి వన్డే ప్రపంచకప్ అవుతుందేమో..? ఇవీ భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు నెలకొన్న అనుమానాలు. ఎందరో దిగ్గజ క్రికెటర్ల అత్యుత్తమ క్రికెట్ విన్యాసాలను అందించిన వన్డే ఫార్మాట్ కథ ముగిసినట్టేనా..? అన్న ఆందోళన వ్యక్తమైన తరుణాన ఈ ఫార్మాట్కు ఇప్పట్లో వచ్చిన నష్టమేమీ లేదని ప్రపంచకప్ నిరూపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా గత ప్రపంచకప్లలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా పది లక్షల మంది క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్లను వీక్షించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ ఏ ప్రపంచకప్ టోర్నీకి ఇంతమంది హాజరుకాలేదు.
ఈ విషయాన్ని స్వయంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన ట్విటర్ ఖాతా వేదికగా సగర్వంగా ప్రకటించింది. నవంబర్ 10న అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్ మ్యాచ్ తర్వాత ఐసీసీ.. ఇప్పటివరకూ ఈ మెగా టోర్నీని స్టేడియాలలోకి వచ్చి పది లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించినట్టు తెలిపింది. 1975 నుంచి వన్డే వరల్డ్ కప్లు, ఇతర ఐసీసీ టోర్నీలు మొదలవగా ఇంతవరకెప్పుడూ ఓ టోర్నీకి ఇంతమంది హాజరుకాలేదు.
Our vision was to make this World Cup the greatest ever and I am truly delighted that we have broken all previous records. My sincere thanks to our devoted fans, the State Associations and every stakeholder who worked tirelessly in the run-up to this mega event. As we now… https://t.co/eYqFZrUrEd
— Jay Shah (@JayShah) November 11, 2023
భారత్లో క్రికెట్ అంటే ఓ మతం వంటిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. దేశంలోని పది నగరాల్లో జరుగుతున్న మ్యాచ్లకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. భారత్ ఆడే మ్యాచ్లతో పాటు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఆడే మ్యాచ్లే గాక అఫ్గానిస్తాన్ ఆడిన మ్యాచ్లనూ చూసేందుకు స్టేడియాలకు ప్రేక్షకులు పోటెత్తారు. కాగా లీగ్ దశలో నేడు బంగ్లాదేశ్ – ఆస్ట్రేలియా మ్యాచ్తో పాటు ఇంగ్లండ్ – పాకిస్తాన్ మ్యాచ్లు జరుగుతుండగా .. ఆదివారం భారత్ – నెదర్లాండ్స్ మ్యాచ్ కూడా ఉండటం.. ఆ తర్వాత రెండు సెమీఫైనల్స్, నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ ఉండటంతో స్టేడియాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మరింత పెరుగనుంది. ఈ ఆదరణ పట్ల ఐసీసీతో పాటు బీసీసీఐ కూడా హర్షం వ్యక్తం చేస్తూ వరల్డ్ కప్ను ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.