దుబాయ్: ఒలింపిక్స్లో ఎన్ని ఆటలు ఉన్నా.. క్రికెట్ ( Cricket ) లేని లోటు ఇండియన్ ఫ్యాన్స్ను వేధిస్తూనే ఉంటుంది. ఈ మెగా ఈవెంట్లో జెంటిల్మెన్ గేమ్ ఉండాలని ప్రతి క్రికెట్ అభిమానీ కోరుకుంటున్నాడు. ఇప్పుడా దిశగా గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఈ విషయాన్ని మంగళవారం ఐసీసీనే ధృవీకరించింది. అంతేకాదు ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చే దిశగా గట్టి ప్రయత్నాలు చేయడానికి ఓ వర్కింగ్ గ్రూపును కూడా ఏర్పాటు చేసింది. 2028 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చేలా ఇప్పటి నుంచే ఈ వర్కింగ్ గ్రూప్ ప్రయత్నాలు మొదలు పెట్టనుంది.
ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడంపై మంగళవారం ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే స్పందించారు. ఐసీసీ తరఫున ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి, టోక్యోకు శుభాకాంక్షలు. క్లిష్ట సమయంలోనూ విజయవంతంగా గేమ్స్ను నిర్వహించారు. ఈ గేమ్స్లో క్రికెట్ ఉండాలని మేమూ ఆశిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు 100 కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అందులో 90 శాతం మంది క్రికెట్ను ఒలింపిక్ క్రీడగా చూడాలనుకుంటున్నారు. దక్షిణాసియాలోనే 92 శాతం మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. అమెరికాలో మరో 3 కోట్ల మంది ఉన్నారు. వీళ్లంతా ఒలింపిక్స్లో క్రికెట్ను చూడాలని ఆశపడుతున్నారు అని బార్క్లే అన్నారు.
అయితే ఇది అంత సులువు కాదు. ఇప్పటికే చాలా గేమ్స్ ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ క్రికెట్ కూడా ఒలింపిక్స్లో భాగం కావడానికి ఇదే సరైన సమయం అని మేము భావిస్తున్నాం అని బార్క్లే చెప్పారు. ఈ వర్కింగ్ గ్రూప్కు ఈసీబీ చైర్మన్ ఇయాన్ వాట్మోర్ చైర్మన్గా వ్యవహరించనున్నారు.