ICC : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్టౌన్(Kape Town)లో జరిగిన రెండో టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం క్రికెట్ పండితులను తీవ్ర విస్మయానికి గురి చేసింది. ఐదు సెషన్లలోనే మ్యాచ్ ఫలితం తేలిపోయిన న్యూలాండ్స్(Newlands) పిచ్పై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ సహా పలువురు క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాంతో, న్యూలాండ్ పిచ్పై ఐసీసీ(ICC) చర్యలకు సిద్ధమైంది.
ఈ గ్రౌండ్పై డీమెరిట్ పాయింట్లు విధించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. పిచ్లకు రేటింగ్ ఇచ్చే విషయంలో ఐసీసీ ద్వంద్వ వైఖరిని తప్పుపట్టిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఇంకా వెల్లడించలేదు.
సెంచూరియన్ టెస్టులో చావుదెబ్బతిన్న భారత్ కేప్టౌన్ టెస్టును సవాల్గా తీసుకుంది. అయితే.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సఫారీ సారథి డీన్ ఎల్గర్(Dean Elgar)కు తాను ఎంత పెద్ద పొరపాటు చేశాడో కాసేపట్లోనే అర్థమైంది. సిరాజ్ విరుచుకుపడడంతో ప్రొటిస్ జట్టు 55 పరుగులకే ఆలౌటయ్యింది. అనంతరం రబడ, బర్గర్ ధాటికి భారత బ్యాటర్లు కూడా పెవిలియన్కు క్యూ కట్టారు. తొలి రోజే ఈ పిచ్పై ఏకంగా 23 వికెట్లు పడడం క్రికెట్ దిగ్గజాలను ఆశ్చర్యానికి గురి చేసింది.