Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: కెప్టెన్ తిలక్ వర్మ (135 బంతుల్లో 101; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), తన్మయ్ అగర్వాల్ (192 బంతుల్లో 164; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో.. నాగాలాండ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ సెమీఫైనల్లో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ బోనస్ పాయింట్లతో గెలిచిన హైదరాబాద్.. గ్రూప్ సెమీస్లో నాగాలాండ్తో తలపడుతున్నది.
సొంతగడ్డపై జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది. తన్మయ్ భారీ సెంచరీ బాదగా.. తిలక్ వర్మ దుమ్మురేపాడు. రోహిత్ రాయుడు (59; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. నితీశ్ రెడ్డి (21), ప్రజ్ఞయ్ రెడ్డి (12) క్రీజులో ఉన్నారు. నాగాలాండ్ బౌలర్లలో జొనాథన్ రెండు వికెట్లు పడగొట్టాడు.