సంస్థాన్ నారాయణపురం, మే 23 : సంస్థాన్నారాయణపురం గ్రామానికి చెందిన దాచేపల్లి రవీందర్గుప్తాను నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తి చేశారు. అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డు వర్సిటీ నుంచి అత్యుత్తమ శాస్త్రవేత్తగా ఎంపిక కావడంతోపాటు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతులమీదుగా యంగ్సైంటిస్ట్గా అవార్డు అందుకున్నారు. 31 ఏండ్లు ఓయూలో ప్రొఫెసర్గా, యువ సైంటిస్టుగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొని అంచెలంచెలుగా ఎదిగి పదోన్నతులు పొందిన దాచేపల్లి రవీందర్గుప్తాను రాష్ట్ర ప్రభు త్వం తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ఎంపిక చేయడంతో సొంత గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సామాన్య మధ్యతరగతి కుటుంబం..
నారాయణపురం గ్రామానికి చెందిన దాచేపల్లి రాములు -లక్ష్మమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. తండ్రి చిన్న కిరాణా దుకాణం నడుపుతూ పిల్లలను కష్టపడి చదివించారు. నాలుగో కుమారుడైన దాచేపల్లి రవీందర్ చిన్నతనం నుంచే చదువుల్లో చురుకుగా ఉండేవారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నారాయణపురంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. 1976-1978లో రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 1978-1981లో నల్లగొండ నాగార్జున డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, 1981-1983లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, 1984-1988లో కంప్యూటర్ మెమరిస్, పిక్చర్ ట్యూబ్లపై పీహెచ్డీ పూర్తి చేశారు. 1989లో ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మొదటి ఉద్యోగం పొందారు. 1998లో అసోసియేట్ ప్రొఫెసర్గా, 2006లో పదోన్నతిపై ప్రొఫెసర్గా దాదాపు 31 ఏండ్లు ఓయూలో ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. ఇటీవల అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డు వర్సిటీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, విద్యా పరిశోధన అంశాల్లో సర్వే చేపట్టి ప్రతిభ ఆధారంగా అత్యుత్తమ శాస్త్రవేత్తగా ఎంపిక చేసింది. 1996లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా యంగ్ సైంటిస్టుగా అవార్డు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్రసాంకేతికశాఖ అందించే బాయ్స్కాస్ట్ ఫెలోషిప్, ఇంగ్లాండ్ నుంచి రాయల్ సొసైటీ ఫెలోషిప్, జపాన్ నుంచి జేఎస్పీఎస్ ఫెలోషిప్ పొందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
లక్ష్యం నెరవేరింది..
తల్లిదండ్రులు గ్రామంలో చిన్న కిరాణా దుకాణం నడుపుతూ కష్టపడి చదివించారు. ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు మంచి పేరు, ప్రఖ్యాతలు తీసుకురావాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాను. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తి చేశాను. ప్రొఫెసర్గా, సైంటిస్టుగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నా యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టాలని లక్ష్యంగా ఉండేది. 31 ఏండ్లు ఓయూలో ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాను. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సటీ వీసీగా నియమించడంతో నా లక్ష్యం నెరవేరింది.
– దాచేపల్లి రవీందర్ గుప్తా
గర్వంగా ఉంది..
మా గ్రామానికి చెందిన దాచేపల్లి రవీందర్ గుప్తా తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ఎంపికైనందుకు ఎంతో గర్వంగా ఉన్నది. చిన్నతనం నుండే కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చారు. మా గ్రామంలోని యువతీ, యువకులు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని చదువుల్లో రాణించాలి.
– మురారిశెట్టి వెంకటయ్య,నారాయణపురం గ్రామస్తుడు