BCCI | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ వేదికలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వివక్ష తేటతెల్లమైంది. పుష్కర కాలం తర్వాత స్వదేశం వేదికగా జరుగుతున్న మెగాటోర్నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ అభిమానుల ఆశలపై నీళ్లు గుమ్మరించింది. అహ్మదాబాద్కు అగ్రతాంబూలం వేసిన బీసీసీఐ హైదరాబాద్పై సవతితల్లి ప్రేమ చూపించింది. నరేంద్రమోదీ స్టేడియానికి 5 కీలక మ్యాచ్లు కేటాయించిన బోర్డు.. హైదరాబాద్కు 3 మ్యాచ్లతో సరిపెట్టింది.
దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ మరే ఆటకు లేదు. క్రికెట్ను ప్రాణంగా ప్రేమించే అభిమానులు కోకొల్లలు. క్రికెట్ను ఒక మతంగా భావించే మన దేశంలో సరిగ్గా పుష్కర కాలం తర్వాత ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ జరుగబోతున్నది. నాలుగోసారి ఆతిథ్యమివ్వబోతున్న భారత్ అందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ప్రపంచంలోనే ధనిక బోర్డుగా వర్ధిల్లుతున్న బీసీసీఐ తమ రేంజ్లో ఏర్పాట్లు చేస్తున్నది. మెగాటోర్నీకి మరో వంద రోజులు మిగిలిఉన్న నేపథ్యంలో ఐసీసీ షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించింది. మొత్తం పది ప్రధాన వేదికలుగా మ్యాచ్లు జరుగనున్నాయి. అయితే ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. అసలు ముచ్చట ఏంటంటే మెగాటోర్నీలో కీలకమైన మ్యాచ్లన్నీ అహ్మదాబాద్కు కేటాయిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
దేశంలో ప్రధాన వేదికలైన ముంబై, హైదరాబాద్, కోల్కతా, చెన్నై, బెంగళూరుకు అప్రాధాన్య మ్యాచ్లు ఇచ్చిన బోర్డు అహ్మదాబాద్కు మాత్రం పెద్దపీట వేసింది. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్కు అగ్రతాంబూలం వేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తనయుడు, బోర్డు కార్యదర్శి జై షా చక్రం తిప్పినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. మెగాటోర్నీలో తొలి మ్యాచ్, ఫైనల్ ఫైట్తో పాటు కోట్లాది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల పోరు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ ఎగురేసుకుపోయింది. ఇలా 5 కీలక మ్యాచ్లను తన్నుకుపోయిన జైషా మిగతా తొమ్మిది వేదికలకు ఎంగిలి మెతుకులు ఎగజల్లినట్లు అప్రధాన్య మ్యాచ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మంగళవారం విడుదలైన ప్రపంచకప్ షెడ్యూల్ను నిశితంగా పరిశీలిస్తే వేదికల విషయంలో బోర్డు వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు ప్రాధాన్యమిచ్చిన బోర్డు మొహాలీ(పంజాబ్), రాంచీ (జార్ఖండ్)కి మొండిచేయి చూపించింది.
భారత క్రికెట్కు అహ్మదాబాద్కు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరొందిన నరేంద్రమోదీ స్టేడియం చరిత్రాత్మక మ్యాచ్లకు వేదిక అవుతోంది. బోర్డు కార్యదర్శిగా వరుసగా రెండోసారి ఎన్నికైన జై షా కనుసన్నల్లో మ్యాచ్లన్నీ అహ్మదాబాద్కు క్యూ కడుతున్నాయి. పునరుద్ధరణ తర్వాత సామర్థ్యం పరంగా ప్రపంచంలో పెద్ద స్టేడియంగా మారిన అహ్మదాబాద్కు మ్యాచ్లు కేటాయిస్తూ వస్తున్నారు. గత రెండేండ్ల కాలంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లు, భారత్ ఆడే వన్డే, టెస్టు, టీ20 మ్యాచ్లను అహ్మదాబాద్కు కేటాయిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మిగతా వేదికలపై బీసీసీఐ ఒక రకంగా సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నది. తాజాగా ప్రపంచకప్ షెడ్యూల్ విషయంలోనూ ఇదే జరిగింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్తో మొదలుపెట్టి భారత్-పాకిస్థాన్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్-దక్షిణాఫ్రికా, ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్లోనే జరుగనున్నాయి.
దేశంలో ఘనమైన క్రికెట్ వారసత్వానికి హైదరాబాద్ ప్రతీక. కానీ జై షా హవాలో హైదరాబాద్కు సముచిత రీతిలో ప్రాధాన్యం లేకుండా పోయింది. ఎంతసేపు అహ్మదాబాద్ జపం పటించే జై షా..హైదరాబాద్పై మరోమారు శీతకన్ను వేశారు. పాలకవర్గం పదవీకాలం ముగిసిందన్న కారణమనో లేక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు సరైన ప్రాతినిధ్యం లేదన్న సాకుతో బోర్డు పెద్దలు మూడంటే మూడు మ్యాచ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అదీ కూడా మన భారత్ ఆడే మ్యాచ్లు కాకుండా దాయాది పాకిస్థాన్ మ్యాచ్లు ఇవ్వడం వారి వైఖరికి అద్దం పడుతున్నది. సౌకర్యాల పరంగా ఏ స్టేడియానికి తీసిపోని హైదరాబాద్..బీసీసీఐ దృష్టిలో ధర్మశాల, పుణె, లక్నో కంటే తక్కువగా కనిస్తున్నది. దీంతో సొంతగడ్డపై టీమ్ఇండియా మ్యాచ్లు చూద్దామనుకున్న హైదరాబాద్ అభిమానులకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది.
గతంలో చరిత్రాత్మక మ్యాచ్లకు వేదికైన మొహాలీ(పంజాబ్)కి ఈసారి మొండిచేయే ఎదురైంది. సరైన సౌకర్యాలు లేవన్న సాకుతో ఈసారి బీసీసీఐ కనీసం ఒక్క మ్యాచ్ కూడా మొహాలీకి కేటాయించలేదు. మొహాలీకి తోడు ఇండోర్, రాజ్కోట్, రాంచీ, నాగ్పూర్కు నిరాశే దక్కింది. ఇదంతా రాజకీయ కక్షతోనే బోర్డు ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని పంజాబ్ క్రీడామంత్రి గుర్మీత్సింగ్ విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.. తిరువనంతపురంను ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐని ట్విట్టర్లో ప్రశ్నించాడు.
వన్డే ప్రపంచకప్ వేదికల్లో మొహాలీ లేకపోవడం కచ్చితంగా రాజకీయ కక్షగానే కనిపిస్తున్నది. ప్రపంచకప్లో చరిత్రాత్మక మ్యాచ్లకు వేదికైన మొహాలీ స్టేడియం లేకపోవడం చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని పంజాబ్ ప్రభుత్వం..బీసీసీఐ దృష్టికి తీసుకెళుతుంది
– గుర్మీత్సింగ్, పంజాబ్ క్రీడా మంత్రి
వన్డే ప్రపంచకప్ వేదికల విషయంలో ఒకింత మనకు నిరాశే ఎదురైంది. కనీసం భారత్ మ్యాచ్ ఒక్కటైనా దక్కుతుందని ఆశించాం. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. ఈ విషయంలో మనం దురదృష్టవంతులం. సమయానికి హెచ్సీఏలో పాలక వర్గం లేకపోవడం హైదరాబాద్ అవకాశాలపై ప్రభావం చూపించింది. హెచ్సీఏ తరఫున ప్రతినిధులు ఉండి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. అహ్మదాబాద్కు కీలక మ్యాచ్ల ఆతిథ్యం దక్కగా, మనకు పాకిస్థాన్ మ్యాచ్లు ఇచ్చారు. ఒక రకంగా మొహాలీకి మొత్తానికే చాన్స్ దక్కకపోగా, మనకు మూడు మ్యాచ్లు రావడం నయమే అనిపిస్తుంది.
-జాన్ మనోజ్, హెచ్సీఏ మాజీ ఉపాధ్యక్షుడు
దేశంలో అత్యుత్తమ క్రికెట్ స్టేడియాల్లో ఒకటైన తిరువనంతపురానికి వన్డే ప్రపంచకప్ వేదికల్లో చోటు దక్కకపోవడం నిరాశ కల్గించింది. అహ్మదాబాద్ దేశ క్రికెట్కు రాజధానిలా మారుతున్నది. కానీ కేరళకు ఒకటో, రెండో మ్యాచ్లు ఇవ్వాల్సింది
– శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో సరైన అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం మన అవకాశాలను దెబ్బతీసింది. పాలకవర్గం పదవీకాలం ముగిసి ఇన్ని రోజులు అవుతున్నా..ఇప్పటికీ ఇంకా ఎన్నికలు జరుగలేదు. సుప్రీం కోర్టు ప్రత్యేక పర్యవేక్షకున్ని నియమించినా బోర్డులో హెచ్సీఏ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ కారణంగా వన్డే ప్రపంచకప్ వేదికల్లో ఒక రకంగా కీలక మ్యాచ్లకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వలేకపోతున్నది. హెచ్సీఏ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. త్వరగా ఎన్నికలు జరిగి పాలకవర్గం ఏర్పడితే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదు. వీలైనంత తొందరగా ఎన్నికలు జరుగాల్సిన అవసరముంది.
– సునీల్బాబు, క్యాట్ అధ్యక్షుడు
వన్డే ప్రపంచకప్ వేదికలను ఐసీసీ, బీసీసీఐ కలిసి నిర్ణయం తీసుకున్నాయి. ఆయా వేదికల్లో ఉన్న సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుంటూ ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. హెచ్సీఏలో నెలకొన్న సమస్యల కారణంగా కీలకమైన మ్యాచ్లు బీసీసీఐ కేటాయించలేకపోయింది. బీసీసీఐలో హెచ్సీఏ నుంచి ప్రతినిధులు ఎవరూ లేకపోవడం మనకు ప్రాధాన్య మ్యాచ్లకు దక్కకపోవడానికి కారణం అనిపిస్తుంది. దీనికి తోడు హెచ్సీఏలో అంతర్గత కుమ్ములాటలు మన అవకాశాలను దెబ్బతీసింది. అందుకే భారత్ కాకుండా పాకిస్థాన్ మ్యాచ్లు కేటాయించారు.
-బీ మోహన్, రంజీ మాజీ క్రికెటర్