హైదరాబాద్, ఆట ప్రతినిధి : పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో! పసి ప్రాయం నుంచే తన అద్బుత ప్రతిభతో అటు క్రీడలతో పాటు చదువుల్లో రికార్డులు తిరుగరాస్తున్న హైదరాబాదీ నైనా జైస్వాల్ మరో ఫీట్ అందుకుంది. 22 ఏండ్లకే డాక్టరేట్ పట్టా అందుకున్న పిన్న వయసు భారతీయురాలిగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నుంచి ఈ టేబుల్ టెన్నిస్ చిచ్చరపిడుగు డాక్టరేట్ పట్టా అందుకుంది. రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాను ఎంచుకుంటూ ‘ ఏ స్టడీ ఆన్ రోల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్ వుమెన్ ఎంపవర్మెంట్’ అనే టాపిక్పై నైనా తన పరిశోధన చేసింది.
ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి టేబుల్ టెన్నిస్ టైటిళ్లను సొంతం చేసుకున్న నైనా చదువుల్లోనూ తనకు తిరుగులేదని చాటిచెబుతున్నది. ‘నా తల్లిదండ్రులు అశ్వాని జైస్వాల్, భాగ్యలక్ష్మి నాకు గురువులు. వారి మద్దతుతోనే ఈ స్థాయికి ఎదిగాను. అడ్డంకులను అధిగమిస్తూ, సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు సాగితే అసాధ్యమన్నది ఏదీ లేదు. డాక్టరేట్ విషయంలో నన్ను గైడ్ చేసిన ముత్యాల నాయుడు, సూరయ్యకు కృతజ్ఞతలు’ అని పేర్కొంది.