బెంగళూరు: భారత హాకీ జట్టు ప్లేయర్ వరుణ్కుమార్ భాగోతం బట్టబయలైంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు బెంగళూరు పోలీసులు వరుణ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జాతీయ హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్పై ఐపీసీ 376(3)(లైంగిక దాడి), 420(మోసం) కింద మంగళవారం కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్కు చెందిన అమ్మాయిపై వరుణ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. వివరాల్లోకెళితే బెంగళూరులోని జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్)లో సదరు అమ్మాయి వాలీబాల్లో శిక్షణ పొందుతున్న సమయంలో వరుణ్తో పరిచయం ఏర్పడింది.
అప్పటి నుంచి తన స్నేహితుల సహాయంతో అమ్మాయితో చనువుగా మెలిగేందుకు ఈ హాకీ ప్లేయర్ ప్రయత్నించినట్లు తెలిసింది. ఆ అమ్మాయి ఒప్పుకోకపోయినా ప్రేమిస్తున్నానంటూ వరుణ్ బలవంతం చేసినట్లు బయటపడింది. ఇలా ఒకే కేంద్రంలో శిక్షణ తీసుకోవడంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఇది అలుసుగా తీసుకున్న వరుణ్..ఆ అమ్మాయి 17 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు లైంగిక దాడి పాల్పడ్డాడని సమాచారం. పెండ్లి చేసుకుంటానని నమ్మబలికిన కుమార్..నగరంలోని హోటల్లలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ అమ్మాయి తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ విషయం బయటికి చెబుతానన్న ప్రతీసారి తనతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించే వాడని ఆమె గోడు వెల్లబోసుకుంది. గత ఐదేండ్లుగా తనను మోసం చేస్తున్న వరుణ్పై తాజాగా అమ్మాయి బెంగళూరులో కేసు పెట్టింది. హిమాచల్ప్రదేశ్కు చెందిన వరుణ్ 2017లో జాతీయ హాకీ జట్టులో అరంగేట్రం చేశాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో వరుణ్ సభ్యుడు.