రాష్ట్ర ప్రభుత్వం సాట్స్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సీఎం కప్-2023 టోర్నీ ముగింపు వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. నాలుగు రోజుల పాటు ఆరు స్టేడియాలు వేదికలుగా 18 క్రీడాంశాల్లో 33 జిల్లాలకు చెందిన ప్లేయర్లు పోటీపడ్డారు. హోరాహోరీగా సాగిన టోర్నీలో హైదరాబాద్(పురుషుల), రంగారెడ్డి(మహిళల) జట్లు ఓవరాల్ చాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాయి. పోటీల ఆఖరి రోజు ముగింపు కార్యక్రమానికి మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి, మంత్రులు మహమూద్అలీ, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు గోపీనాథ్, భరత్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, నగర మేయర్ విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్: నాలుగు రోజుల పాటు నగరంలో నెలకొన్న క్రీడా సందడికి బుధవారం తెరపడింది. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కప్-2023 పేరిట సాట్స్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి జరిగిన టోర్నీ విజయవంతంగా ముగిసింది. మొత్తం 33 జిల్లాలకు చెందిన యువతీయువకులు 18 క్రీడాంశాల్లో తమ ప్రతిభ చాటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే స్థాయికి రాష్ట్ర ప్లేయర్లు ఎదగాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా టోర్నీ రూపకల్పన జరిగింది. తొలుత మండల స్థాయి ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలతో మైదానాలు కొత్త కళను సంతరించుకున్నాయి. మండే ఎండలను కూడా లెక్కచేయకుండా గ్రామీణ ప్రాంత యువత సత్తాచాటడమే లక్ష్యంగా బరిలోకి దిగింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుంటూ ప్లేయర్లు అందరూ ప్రతిభ చాటారు. గ్రామీణ ప్రాంత ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మొదలైన సీఎం కప్ మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన వైనం కట్టిపడేసింది.
రాష్ట్ర స్థాయి టోర్నీలో పురుషుల విభాగంలో హైదరాబాద్ 89 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది. రంగారెడ్డి(56), మేడ్చల్ మల్కాజిగిరి(41) ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నాయి. మహిళల విభాగంలో రంగారెడ్డి(49) చాంపియన్గా నిలువగా, హైదరాబాద్(36), మేడ్చల్ మల్కాజిగిరి(31) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. టీమ్ విజేతకు లక్ష, ద్వితీయ, తృతీయ స్థానాలకు వరుసగా 75 వేలు, 50 వేల నగదు ప్రోత్సాహం దక్కింది.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నీ చరిత్రలో నిలిచిపోతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ముగింపు పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరైన క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు సీఎం కప్ నిర్వహించింది. చాలా తక్కువ సమయంలోనే టోర్నీ నిర్వహించాం. అంచనాలకు మించి ఊహించిన దాని కంటే విజయవంతమైంది. త్వరలో ప్రకటించబోయే నూతన క్రీడా పాలసీలో సీఎం కప్ నిర్వహణ అంశాన్ని పొందుపరుస్తాం’ అని అన్నారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కప్లోపతకాలు సాధించిన వారికి తమ విద్యాసంస్థల్లో రాయితీ ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ ‘సీఎం కప్ విజయవంతం చేయడంలో కీలకమైన అందరికీ కృతజ్ఞతలు. గుడి, బడి లాగే మైదానాలను గౌరవించాలి’ అని అన్నారు. ముగింపు కార్యక్రమంలో
వోఎస్డీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.