Ranji Trophy | హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హైదరాబాద్.. ఐదో మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నది. ప్లేట్ గ్రూప్లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన పోరులో మన బౌలర్లు సత్తాచాటడంతో మిజోరాం 199 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ రాయుడు 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 120 పరుగులు చేసింది.
గత మ్యాచ్ ట్రిపుల్ సెంచరీ హీరో తన్మయ్ అగర్వాల్ (6) త్వరగా పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రాహుల్ సింగ్ (81), రోహిత్ రాయుడు (25) క్రీజులో ఉన్నారు. చేతిలో 9 వికెట్లు ఉన్న హైదరాబాద్ ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 79 పరుగులు వెనుకబడి ఉంది. గత నాలుగు మ్యాచ్ల్లోనూ ఇన్నింగ్స్ విజయాలు అందుకున్న హైదరాబాద్.. ఈ సారి కూడా అదే దిశగా సాగుతున్నది.