Indian Shuttlers : భారత స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy), లక్ష్యసేన్(Lakshyasen) కీలక టోర్నీ నుంచి తప్పుకున్నారు. మంగళవారం ప్రారంభం కానున్న సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి ఈ ఇద్దరూ వైదొలిగారు. ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) బెర్తుపై గురిపెట్టిన ప్రణయ్, లక్ష్యసేన్ తీరిక లేని షెడ్యూల్ నుంచి కాసింత విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు.
వచ్చే సీజన్లో వీళ్లు తమ ర్యాంక్ మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. మరోవైపు గాయం నుంచి కోలుకుంటున్న పీవీ సింధు కూడా ఈ టోర్నీలో ఆడడం లేదు. భారత్ నుంచి ఆరో సీడ్ కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్, బి.సాయి ప్రణీత్, సమీర్ వర్మలు పురుషుల సింగిల్స్లో పోటీ పడనున్నారు. శ్రీకాంత్ తొలి రౌండ్లో చియా హవో లీ(చైనీస్ తైపీ)తో, దిమిత్రి పనరిన్(కజకిస్థాన్)తో తలపడనున్నారు. మాజీ వరల్డ్ నంబర్ 1 సమీర్ వర్మ తొలి మ్యాచ్లో వాంగ్ జూ వీ(చైనీస్ తైపీ)ని ఢీకొట్టనున్నాడు.
19వ ఆసియా గేమ్స్ టీమ్ విభాగంలో ప్రణయ్, లక్ష్యసేన్, శ్రీకాంత్ రజతం గెలిచిన విషయం తెలిసిందే. ఫైనల్కు ముందు వెన్నునొప్పితో బాధపడిన ప్రణయ్.. తాజాగా చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో సెమీస్ వరకూ వెళ్లాడు. ఇక కెనడా ఓపెన్ విజేత లక్ష్యసేన్ వచ్చే సీజన్లో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు.