Sircilla | ‘రైతులు, నేతన్నల ఆత్మహత్యలు, దొరల అరాచకాలు, అన్నల పోరాటాలు, బాంబు దాడులు, హత్యలు, ఎన్కౌంటర్లతో నిత్యం వార్తల్లో నిలిచే కరీంనగర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది. పల్లెల్లో కాళేశ్వరం నీళ్లు, పట్టణాల్లో ప్రగతి కండ్లకు కనిపిస్తున్నాయి. వలస పోయిన వాళ్లు తిరిగొచ్చిన వేళ ఊళ్లన్నీ నిండుగా ఉన్నాయి.’ అని కరీంనగర్ కవి, సినిమా విమర్శకుడు వారాల ఆనంద్ అంటున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ముద్ర కనిపిస్తున్నదని.. కరీంనగర్ గుర్తు పట్టలేనంతగా మారిపోయిందని చెబుతున్న ఆయన్ను ‘నమస్తే’ పలకరించింది.
తెలంగాణ ఉద్యమకాలంలో మీరు చూసిన మార్పు?
తెలంగాణ భావన పెరిగిన తర్వాత కరీంనగర్ పట్టణంలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు ఇక్కడ దొరల అరాచకాల గురించే చర్చ జరిగేది. ఉద్యమ కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలే కాదు తెలంగాణ భాష, యాస, సంస్కృతి, తెలంగాణ సినిమా గురించి మాట్లాడటం మొదలైంది. ఈ అంశాలపై ఎస్ఆర్ఆర్ కాలేజీ కేంద్రంగా డిబేట్ జరిగేది.
సొంత రాష్ట్రం వచ్చినంక మీ ఊరెట్ల మారింది?
గడియారం సెంటర్ కరీంనగర్కు గుండెకాయ. నా బాల్యమంతా ఆ గడియారం సెంటర్ చుట్టూ తిరిగింది. గడియారం చౌరస్తా, కమాన్ దగ్గర ఒకప్పుడు పేరు పెట్టి పిలిస్తే పలికేవాళ్లం. ఇప్పుడు జనాభా, పట్టణీకరణ పెరిగింది. ముప్పై ఏండ్ల నాటి కరీంనగర్కు నేటి కరీంనగర్కు జమీన్ ఆస్మాన్ ఫరక్ స్పష్టంగా కనిపిస్తున్నది. బజారుకు పోతే దారి అడగాల్సి పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు రోడ్లకు రెండు పక్కలా కంపుకొట్టే డ్రైనేజీ ఉండేది. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు.
ప్రజల జీవితాల్లో మార్పు కనిపిస్తున్నదా?
ఎస్ఆర్ఆర్ కాలేజీలో 2016 వరకు పదహారు ఏండ్లు లెక్చరర్గా పని చేశా. అప్పట్లో అర కిలోమీటర్ దూరం నడిస్తేనో, కోర్టు దాక పోతేనే ఛాయ్ దొరికేది. ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీ పక్కన లెక్కలేనన్ని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫుడ్ కోర్టులు, బేకరీలు, ఛాట్బండార్లు, రకరకాల వ్యాపారాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణమేంటంటే నీళ్ల సౌలత్.. సాగునీరు వచ్చినంక పంటల సాగు, దిగుబడి పెరిగినయ్. ప్రజల ఆదాయం, భూముల ధరలు పెరిగినయ్. పట్టణాల్లో స్థిరపడేవాళ్లు ఎక్కువయ్యారు.
సిరిసిల్లలో అప్పటికి, ఇప్పటికి ఏం వ్యత్యాసం కనిపిస్తున్నది?
సిరిసిల్లను ఈ రోజు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. నలభై ఏండ్ల నాటి సిరిసిల్లకు, నేటి సిరిసిల్లకు పోలికే లేదు. రోడ్లు, వసతులు పెరిగాయి. సిరిసిల్లకు బైపాస్ రోడ్ వేశారు. గ్రంథాలయం చాలా అద్భుతంగా ఉన్నది. లైబ్రరీని చూస్తే ఈర్ష్య కలుగుతున్నది. కోకాపేట భూముల్లెక్క ఇక్కడి భూములు అమ్ముడుపోతున్నయ్.
నేతన్నల చావును చూసిన ‘ఉరిసిల్ల’ ఇప్పుడెట్లుంది?
సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యల గురించి డాక్యుమెంటరీలు చేసేందుకు ఫిల్మ్ మేకర్ కేఎన్టీ శాస్త్రి మా జిల్లాకు వచ్చారు. చేనేత కార్మికులతో మాట్లాడేందుకు ఆయనకు నేనే సహకరించా. ‘డెత్ లూమ్స్’ పేరుతో ఆ డాక్యుమెంటరీ దూరదర్శన్లో ప్రసారమైంది. అప్పటికీ ఇప్పటికీ చేనేతల జీవితాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. నేత పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది. కొత్త టెక్నాలజీ వచ్చింది. టెక్స్టైల్, అపారెల్ పార్కు వచ్చింది. సౌకర్యాలు మెరుగయ్యాయి. దుబాయ్, సోలాపూర్, భీవండి, బొంబాయి పోయినవాళ్లు తిరిగొచ్చారు.
నేటి రాజకీయాలపై తెలంగాణ ఉద్యమ ప్రభావం ఉందా?
1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విఫలమైంది. దీంతో ఆ ఉద్యమంలో పాల్గొన్న యువత నక్సలిజం వైపు మళ్లింది. రెండో దశ ఉద్యమంలో అందరి పోరాటం ఫలితంగా తెలంగాణ వచ్చింది. నిన్న ఉద్యమాన్ని బలపరిచిన వాళ్లు నేడు పవర్ పాలిటిక్స్లో ఉన్నారు. అందువల్ల నీళ్లు, నిధులు, కరెంట్పై మనకు అధికారం వచ్చింది.
అప్పటి కల్లోల తెలంగాణలోని పల్లెలు ఇప్పుడెట్లున్నయ్?
తెలంగాణ ఉద్యమ కాలంలో, ఎనభై, తొంభైలలో పల్లెల్లో చాలా దయనీయమైన పరిస్థితులు ఉండేవి. గ్రామాల్లో అరాచకం రాజ్యమేలేది. దానికి వ్యతిరేకంగా పోరాటాలు నడిచేవి. ఈ రెండింటి మధ్య హత్యలు, ఎన్కౌంటర్లు, బాంబు పేలుళ్లు జరిగేవి. ఎప్పుడు ఏం జరుగుతుందోని భయం. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు.
పదేండ్ల తెలంగాణ ప్రగతిపై మీరేమంటారు?
పదేండ్లలో పట్టణీకరణ వేగం పుంజుకున్నది. వ్యాపారాలూ అదే స్థాయిలో పెరిగాయి. ఇది తెలంగాణ సమాజంలో వచ్చిన అతిపెద్ద మార్పు. యాభై ఏండ్ల పాటు సాగుతూ.. వచ్చిన అభివృద్ధికి ఈ పదేండ్ల అభివృద్ధికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇందుకు ప్రధాన కారణం సాగు నీళ్లు, కరెంటు. రైతుబంధు అందుతున్నది. ఇంకేం కావాలి. ఒకప్పుడు కరెంటు ఎపుడొస్తుందో? ఎప్పుడు పోతుందోనని రైతులు భయపడుతూ ఉండేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి ఎక్కడా లేదు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తి పెరిగింది. ఆ ఉత్పత్తి ప్రభావం ఆర్థిక రంగాన్ని ముందుకు నెట్టింది.
…రాయల నాగవర్దన్, ఫొటో: గడసంతల శ్రీనివాస్