WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final 2023) గెలిచిన ఆస్ట్రేలియా(Australia)కు భారీ ప్రైజ్ మనీ దక్కింది. టెస్టు గదతో పాటు రూ. 13 కోట్లు(1.6 మిలియన్ డాలర్లు) ముట్టాయి. రన్నరప్గా నిలిచిన భారత జట్టు(TeamIndia)కు రూ. 6.5 కోట్లు(8 లక్షల డాలర్లు) బహుమతిగా లభించాయి.
తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగు పెట్టిన ఆసీస్ సంచలన ఆటతో అదరగొట్టింది. 209 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది. కంగారు జట్టు ఐసీసీ ఫైనల్స్లో చాంపియన్గా అవతరించడం ఇది 9వ సారి. అంతేకాదు టెస్టులు, వన్డేలు, టీ20, చాంపియన్స్ ట్రోఫీ.. ఇలా అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీ అందుకున్న ఏకైక జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది.
టెస్టు చాంపియన్షిప్(World Test Championship)లో పోటీపడిన మిగతా జట్లకు కూడా ఐసీసీ నగదు బహుమతి ప్రకటించింది. ప్రైజ్మనీలో మిగిలిన 31 కోట్లను వాటికి తలా కొంత ఇవ్వాలని నిర్ణయించింది. ఆ లెక్క ప్రకారం మూడో స్థానంతో సరిపెట్టుకున్న దక్షిణాఫ్రికాకు రూ.3.7 కోట్లు, నాలుగో ప్లేస్లో నిలిచిన ఇంగ్లండ్కు రూ. 2.8 కోట్లు ముట్టనున్నాయి. ఐదో స్థానంలో ఉన్న శ్రీలంకకు రూ.1.64 కోట్లు, ఆరో ప్లేస్లోని న్యూజిలాండ్తో సహా పాకిస్థాన్(7వ స్థానం), వెస్టిండీస్(8వ ప్లేస్), బంగ్లాదేశ్(9వ స్థానం) జట్లకు తలా రూ.82 లక్షలు లభించనున్నాయి.
రహానే, కోహ్లీ
టెస్టు క్రికెట్కు కొత్త జీవం తెచ్చిన టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. మొదటి ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్(163), స్టీవ్ స్మిత్(121) సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 469 రన్స్ కొట్టింది. ఆ తర్వాత భారత్ 269కే ఆలౌటయ్యింది. రెండో ఇన్నింగ్స్ను ఆసీస్ 270వద్ద డిక్లేర్ చేసింది. 444 పరుగుల ఛేదనలో టీమిండియా 234కు ఆలౌటయ్యింది. విరాట్ కోహ్లీ(49), అజింక్యా రహానే(46), శ్రీకర్ భరత్(23) పోరాడినా లాభం లేకపోయింది. లియాన్ ఓవర్లో సిరాజ్ ఔట్ కావడంతో దాంతో 209 పరుగులతో ఆసీస్ అద్భుత విజయం సాధించింది. దాంతో, రెండోసారైనా చాంపియన్గా నిలవాలనుకున్న టీమిండియా కల చెదిరింది.