చిరకాల ప్రత్యర్థితో పోరు ‘డ్రా’ అయిందనే బాధో..జపాన్ చేతిలో పరాజయం పాలయ్యామన్న కసో..తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత హాకీ జట్టు అదరగొట్టింది.15 గోల్స్ తేడాతో గెలిస్తేనే నాకౌట్కు అర్హత సాధించే క్లిష్ట పరిస్థితుల్లో.. 16-0తో ఇండోనేషియాపై ఏకపక్ష విజయం సాధించి భళా అనిపించుకుంది!
జకార్తా: హాకీ ఆసియా కప్ తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత జట్టు.. మూడో మ్యాచ్లో ఘన విజయం సాధించింది. పూల్-‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో యువ భారత జట్టు 16-0తో ఇండోనేషియాను మట్టికరిపించింది. ఈ విజయంతో పాకిస్థాన్ను వెనక్కినెట్టిన టీమ్ఇండియా నాకౌట్లో అడుగుపెట్టింది. దీంతో పాక్ జట్టు ఆసియా కప్ నాకౌట్ అవకాశాలను దూరం చేసుకోవడంతో పాటు.. ప్రపంచ కప్ క్వాలిఫికేషన్కు దూరమైంది. గ్రూప్లో జపాన్ (9 పాయింట్లు) అగ్రస్థానం దక్కించుకోగా.. భారత్, పాకిస్థాన్ చెరో 4 పాయింట్లతో సమంగా నిలిచాయి.
ఆఖరి పోరులో 15 గోల్స్ తేడాతో నెగ్గితేనే నాకౌట్కు అర్హత సాధించే పరిస్థితుల్లో టీమ్ఇండియా దుమ్మురేపింది. దిప్సాన్ టిర్కీ ఐదు గోల్స్తో విజృంభించగా.. సుదేవ్ మూడు గోల్స్ బాదాడు. సునీల్, పవన్, కార్తి రెండేసి గోల్స్ సాధించగా.. ఉత్తమ్ సింగ్, నీలమ్ ఒక్కో గోల్ కొట్టారు. మొత్తం మ్యాచ్లో మనవాళ్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్పై 36 సార్లు దాడి చేయడంతో పాటు 21 పెనాల్టీ కార్నర్ అవకాశాల్లో ఎనిమిదింటిని గోల్స్గా మలిచారు.
మన ఆటగాళ్లు 43 సార్లు ప్రత్యర్థి సర్కిల్లోకి దూసుకెళ్తే.. ఇండోనేషియా ప్లేయర్లు కేవలం ఒక్కసారే ఆ ప్రయత్నం చేశారంటేనే ఈ మ్యాచ్లో భారత్ ఆధిపత్యం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. మనవాళ్లు చివరి క్వార్టర్లోనే ఆరు గోల్స్ చేయడం విశేషం. అంతకుముందు జరిగిన పోరులో పాకిస్థాన్ 2-3తో జపాన్ చేతిలో ఓటమి పాలైంది.