Unforgettable moments in cricket history | ఏమో.. మిగతా దేశాల సంగతేమో కానీ మన దగ్గర మాత్రం క్రికెట్ను ఆరాధించేవాళ్లు కోకొల్లలు. క్రికెట్ అంటే చెవి కోసుకోవడమే కాదు.. క్రికెటర్లను నెత్తినపెట్టుకుని ఊరేగిస్తారు. మనోళ్లు క్రికెట్ అంటే ఎంతగా పడిచిచ్చపోతారంటే.. పాకిస్థాన్ లాంటి దేశంతో మ్యాచ్ జరిగితే నగరాల్లోని వీధులన్నీ బోసిపోతాయి. అన్నీ బంద్ పెట్టి టీవీలకు అతుక్కపోతారు. మరి అంతటి అభిమానం చూపే అభిమానులు భారత జట్టు మ్యాచ్ ఓడిపోతే తట్టుకోగలరా? వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతారు. ఆటగాళ్ల ఇళ్లపై దాడులు చేస్తారు. వారి దిష్టిబొమ్మలు తగలబెడతారు. భారత క్రికెట్లో దిగ్గజాలు అనబడే సచిన్, ధోనీలకు కూడా అభిమానుల సెగ తాకింది. అలాంటి ఐదు ఘటనలపై ఓ లుక్కేద్దాం.
అది 1996 విల్స్ వరల్డ్ కప్. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. జట్టు ఓటమి దిశగా పయనిస్తుండడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మైదానంలోని ప్రేక్షకులు మ్యాచ్ పూర్తికాకుండా అడ్డుకున్నారు. మైదానంలోకి నీళ్ల బాటిల్స్, ఇతర వస్తువులు విసురుతూ విధ్వంసం సృష్టించారు. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా మ్యాచ్ కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో శ్రీలంక విజయం సాధించినట్టు రిఫరీ ప్రకటించాడు. మ్యాచ్ తర్వాత కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ నుంచి భారత ఆటగాళ్లు వెనుదిరిగినప్పుడు అజారుద్దీన్ను అభిమానులు లక్ష్యంగా చేసుకున్నారు. డ్రై పిచ్పై టాస్ గెలిచిన తర్వాత చేజింగును ఎంచుకుని జట్టు కొంప ముంచాడంటూ విరుచుకుపడ్డారు. ఆటగాళ్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ముఖ్యంగా అజారుద్దీన్ దిష్టిబొమ్మలను దేశవ్యాప్తంగా తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అజారుద్దీన్ ఇంటి వద్ద భద్రత పెంచారు.
ప్రపంచకప్ 2003లో టీమిండియా ఫైనల్ చేరినా ఫ్యాన్స్ నుంచి ఆటగాళ్లకు బెదిరింపులు తప్పలేదు. తొలి మ్యాచ్లో హాలెండ్ను అతి కష్టం మీద ఓడించిన భారత జట్టు ఆస్ట్రేలియాలో చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలు కావడంతో స్వదేశంలోని అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. వీధుల్లోకి వచ్చి క్రికెటర్ల పోస్టర్లను తగలబెట్టారు. ఆటగాళ్ల ఇళ్లపై రాళ్ల దాడికి దిగారు.కెప్టెన్ సౌరవ్ గంగూలీ, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఫొటోలను తగలబెట్టారు. గంగూలీకి వ్యతిరేకంగా నినదించారు. మరీ ముఖ్యంగా అలహాబాద్లోని మహ్మద్ కైఫ్ ఇంటిపై హింసాత్మక దాడి జరిగింది. పెయింట్, బ్లాక్ ఆయిల్ ఉన్న ప్లాస్టిక్ బ్యాకులను కైఫ్ ఇంటిపైకి విసిరి బీభత్సం సృష్టించారు. ఈ ఘటన తర్వాత భారత జట్టు వరుసగా 8 మ్యాచుల్లో నెగ్గి ఫైనల్కు చేరుకుంది.
2007లో వెస్టిండీస్లో జరిగిన ప్రపంచకప్ భారత్కు పీడకల మిగిల్చింది. స్టార్లతో నిండిన టీమిండియా తొలి రౌండ్లోనే నిష్క్రమించి అభిమానుల ఆగ్రహానికి గురైంది. బెర్ముడా వంటి చిన్న జట్టుపై ఓ విజయంతో సరిపెట్టుకుంది. 2003లో ఓ మెట్టు దూరంలో కప్ను కోల్పోయిన భారత జట్టు ఈ టోర్నీలో కప్పు సాధించే లక్ష్యంతో అడుగుపెట్టింది. అయితే, ఓపెనింగ్ గేమ్లోనే బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలై నిరాశకు గురైంది. ఈ ఓటమిని అభిమానులు అంత తేలిగ్గా తీసుకోలేదు. ప్లేయర్స్ ఇళ్లపై రాళ్ల దాడికి దిగారు. దేశవ్యాప్తంగా ఆటగాళ్ల దిష్టిబొమ్మలు దహనం చేశారు. కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్లను అభిమానులు టార్గెట్ చేసుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఎంఎస్ ధోనీ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. ధోనీకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలని ఝార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
2014 టీ20 ప్రపంచకప్లో ఫైనల్కు చేరిన టీమిండియా దేశానికి మరో ప్రపంచకప్ అందిస్తుందని అభిమానులు భావించారు. విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉండడంతో ఫైనల్లో శ్రీలంకపై విజయం నల్లేరు మీద నడకేనని నమ్మకంతో ఉన్నారు. అయితే, భారత జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. కేన్సర్ నుంచి కోలుకుని జట్టులోకి తిరగొచ్చిన యువరాజ్ సింగ్ ఫైనల్లో 21 బంతులు ఆడి 11 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన లంక కప్పును ఎగరేసుకుపోయింది. ఈ మ్యాచ్లో జట్టు ఓటమికి యువరాజ్ ఇన్నింగ్స్ కారణమంటూ ఫ్యాన్స్ ఫైరయ్యారు. ఈ ఓటమి తర్వాత చండీగఢ్లోని యువరాజ్ ఇంటి వద్ద గుమిగూడిన అభిమానులు రాళ్లు విసిరి నానా హంగామా చేశారు. యువీ రిటైర్ కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన ఓ నోబాల్ మ్యాచ్ గతిని మార్చేసింది. పాక్ ఇన్నింగ్స్ను బుమ్రా మొదట్లోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ ఫకర్ జమాన్ వికెట్ తీసుకున్నాడు. అయితే, ఆ బంతి నోబాల్ కావడంతో భారత్ కొంప కొల్లేరైంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫకర్ జమాన్ సెంచరీతో చెలరేగి జట్టుకు చాంపియన్స్ ట్రోఫీ అందించిపెట్టాడు. ఈ ఓటమి తర్వాత అభిమానులకు బుమ్రా టార్గెట్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోశారు. మీమ్స్, జోక్స్తో విరుచుకుపడ్డారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ను హోరెత్తించారు. ట్రాఫిక్ అవగాహన కోసం జైపూర్ పోలీసులు బుమ్రా నోబాల్ మీమ్స్ను ఉపయోగించడం కూడా వివాదాస్పదమైంది. దేశం కోసం శక్తిమేర ఆడుతున్న తర్వాత ఆటగాడికి లభిస్తున్న గౌరవానికి ఇది అద్దం పడుతోందంటూ బుమ్రా ఆవేదనగా ట్వీట్ చేశాడు.
ఆట ఏదైనా గెలుపోటములు సహజం. దానిని స్వీకరించే నేర్పు ఉండాలి. క్రికెట్ వంటి జెంటిల్మన్ గేమ్లో ఇది మరింత అవసరం. అభిమానం హద్దుల్లో లేకపోతే జరిగే పరిణామలు ఇలానే ఉంటాయని ఈ ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి.