Team India Historic Moments : క్రికెట్ను ఎంతగానో ప్రేమించే భారత గడ్డపై ఈఏడాది వన్డే వరల్డ్ కప్(ICC ODI WC 22023) జరగనుంది. దాంతో, స్వదేశంలో భారత జట్టు మరోసారి ప్రపంచకప్ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ సమయంలో.. టీమిండియా సాధించిన చారిత్రాత్మక విజయాలను, చరిత్రను తిరగరాసిన మధుర ఘట్టాలను ఓ సారి గుర్తు చేసుకుందాం. భారత జట్టు ప్రపంచంలోని మేటి జట్లలో ఒకటిగా ఎదిగే క్రమంలో ఎన్నో సంచలన ప్రదర్శనలు చేసింది. 1983లో కపిల్ దేవ్(Kapil Dev) నేతృత్వంలో మొదటిసారి వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడి రోజుతో మొదలు 2013 చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)ని కైవసం చేసుకున్న క్షణాలు ఇప్పటికీ అభిమానులు కళ్లల్లో మెదులుతూనే ఉంటాయి. అంతేకాదు ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ విజయాలు కూడా ఎంతో అపురూపం. దిగ్గజ జట్లకు సైతం సాధ్యం కాని రికార్డులు కొల్లగొట్టిన టీమిండియా విజయ ప్రస్థానం ఇది.
భారత జట్టు విజయ ప్రస్థానం వెస్టిండీస్(Westindies), ఇంగ్లండ్(England) జట్లపై విజయంతో మొదలైందని చెప్పాలి. ఎందుకంటే..?అప్పటికే దిగ్గజ జట్లుగా పేరున్న వెస్టిండీస్, ఇంగ్లండ్పై టెస్టు విజయాలు భారత క్రికెట్లో మర్చిపోలేని క్షణాలు. ఈ విజయాలతో భారత జట్టు టెస్టుల్లో నంబర్ వన్ స్థానానికి చేరింది. వెస్టిండీస్తో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు 1-0తో గెలిచి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇంగ్లండ్పై మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 1-0తో సొంతం చేసుకుంది. ఓవల్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో భారత బౌలర్ భగవత్ చంద్రశేఖర్ ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 101 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత జట్టు 170 పరగులు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. దాంతో, ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది.
భారత జట్టు 1983లో తొలిసారి విశ్వ విజేతగా అవతరించింది. అప్పటివరకు క్రికెట్ను ఏలుతున్న మేటి జట్లకు గట్టి హెచ్చరికలు పంపింది. అవును.. భారత క్రికెట్లో 1983 ప్రపంచకప్ ఒక సువర్ణాధ్యాయం. ఎందుకంటే..? ఆ ఏడాది భారత్ ఫైనల్లో ఓడించింది అనామక జట్టును కాదు. అప్పటికే వరుసగా (1975, 1979)రెండు ప్రపంచ గెలిచిన వెస్టిండీస్ను. హ్యాట్రిక్ ట్రోఫీ సాధించాలనుకున్న విండీస్ను లార్డ్స్ స్టేడియంలో కపిల్ సేన మట్టికరిపించింది.
వరల్డ్ కప్ ట్రోఫీతో కపిల్ దేవ్
1983 జూన్ 25న జరిగిన టైటిల్ పోరులో విండీస్పై 43 పరుగుల తేడాతో గెలుపొంది తొలిసారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. దాంతో, ఒక్కసారిగా అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా పేరు మార్మోగిపోయింది. సెమీ ఫైనల్లో జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో భారత్ను ఫైనల్కు చేర్చాడు.
వరల్డ్ కప్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో భారత జట్టు 1975 ప్రపంచకప్లోనూ అదరగొట్టింది. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ తలపడ్డాయి. అయితే.. ఈ టోర్నీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్పై టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఈ టోర్నీలో భారత జట్టు ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగింది. కానీ, సునీల్ గవాస్కర్ సారథ్యంలోని టీమిండియా పెద్ద జట్లకు షాకిచ్చి ఫైనల్ చేరింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రపంచ చాంపియన్షిప్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
ప్రపంచ చాంపియన్షిప్ ట్రోఫీతో సునీల్ గవాస్కర్ బృందం
అప్పటివరకు ఆస్ట్రేలియాపై ఓటమి తప్ప విజయం ఎరుగని భారత జట్టు 2011లో చరిత్రను తిరగరాసింది. కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్లో స్టీవ్ వా సారథ్యంలోని ఆసీస్పై సంచలన విజయం నమోదు చేసింది. దాంతో, వరుసగా 16 వరుస విజయాలతో ఊపుమీదున్న కంగారూ జట్టు జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. తొలి టెస్టులో గెలిచిన ఆసీస్కు ఈడెన్గార్డెన్స్లో భారత జట్టు షాకిచ్చింది. క్రీజులో పాతుకుపోయిన వాల్ రాహుల్ ద్రవిడ్(180), వీవీఎస్ లక్ష్మణ్(281) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత చెన్నై టెస్టులోనే నెగ్గిన భారత్ 2-1తో సిరీస్ను సొంతం చేసుకుంది. ఆసీస్ వరుస విజయాలకు అడ్డుకట్ట వేసిన జట్టుగా రికార్డులకెక్కింది. భారత క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సిరీస్లలో ఇదొకటి.
వన్డే చాంపియన్ అయిన భారత జట్టు 2007లో మరోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఐసీసీ తొలిసారి నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ను భారత జట్టు ఎగరేసుకుపోయింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఈ టోర్నీలో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో పాకిస్థాన్పై 5 పరుగుల తేడాతో గెలిచి, తొలి టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకుంది.
తొలి టీ20 ప్రపంచకప్తో భారత ఆటగాళ్లు
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. గౌతం గంభీర్ 75 పరుగులతో రాణించాడు. అయితే.. మిస్బావుల్ హక్(44) భారత్ను కాసేపు భయపెట్టాడు. చివరి ఓవర్లో పాక్ విజయానికి 13 పరుగులు కావాలి. ధోనీ, జోగిందర్శర్మ చేతికి బంతి ఇచ్చాడు. మిస్బా షార్ట్ ఫైన్లైగ్ దిశగా షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని శ్రీశాంత్ ఒడిసిపట్టుకోవడంతో భారత శిబిరంలో సంబురాలు మొదలయ్యాయి.
2009 డిసెంబరు 6.. భారత క్రికెట్లో మర్చిపోలేని రోజు. మేటి జట్లను ఓడిస్తూ వచ్చిన టీమిండియా ఇదే రోజు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరింది. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని భారత జట్టు వరుసగా నాలుగో టెస్ట్ సిరీస్ విజయాంతో నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకుంది. 2011 వరకు టాప్ జట్టుగా కొనసాగింది. మళ్లీ 2016లో టీమిండియా నంబర్ 1 టెస్టు జట్టుగా నిలిచింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్ 2021లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరింది. అయితే.. అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది.
వరల్డ్ కప్తో సచిన్, సురేశ్ రైనా, భజ్జీ
1983 తర్వాత టీమిండియా వన్డే వరల్డ్ కప్ కల 28 ఏళ్ల తర్వాత నిజమైంది. 2011లో సొంత గడ్డపై భారత జట్టు చాంపియన్గా అవతరించింది. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన భారత జట్టు ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి ప్రపంచకప్ను అందుకుంది. లెజెండ్ సచిన్ టెండూల్కర్కు మర్చిపోలేని బహుమతి అందించింది. మొదట ఆడిన లంక 274 పరుగులు కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ (92 నాటౌట్), గౌతంగంభీర్(97) ధనాధన్ ఆడారు. వీళ్లు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గంభీర్ ఔటయ్యాక యువరాజ్ సింగ్తో కలిసి ధోనీ మరింత ధాటిగా ఆడాడు. సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు.
వన్డే, టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు చాంపియన్స్ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షలా మిగిలిపోయింది. అయితే.. 2013లో ధోనీ కెప్టెన్సీలో టీమిండియా తొలిసారి చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దాంతో, ఐసీసీ నిర్వహించే అన్ని ట్రోఫీలు గెలిచిన దేశంగా అవతరించింది. అంతేకాదు టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోపీలూ అందించిన కెప్టెన్గా ధోనీ అరుదైన ఘనత సాధించాడు. ఫైనల్లో బలమైన ఇంగ్లండ్ను 5 పరుగుల తేడాతో మట్టికరిపించింది. భారత్ నిర్దేశించిన 129 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 124 పరుగులకే ఆలౌటయ్యింది. దాంతో, భారత్ తొలిసారి చాంపియన్స్ ట్రోఫీని అందుకుంది.
స్వదేశంలో ఘనమైన రికార్డు ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై తడబడేది. అయితే.. 2018-19లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. కంగారులను సొంత గడ్డపై ఓండిచిన జట్టును రికార్డుల్లోకి ఎక్కింది. నాలుగు మ్యాచ్ల సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. నయా వాల్ చతేశ్వర్ పుజారా అద్భుత బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2020-21లో భారత జట్టు ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం నమోదు చేసింది.
ఆస్ట్రేలియాపై తొలి సిరీస్ ట్రోఫీ గెలిచిన విరాట్ కోహ్లీ బృందం
అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయిన జట్టు ఆ తర్వాత పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో రాణించిన రహానే (112) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక కీలకమైన చివరిదైన బ్రిస్బేన్ టెస్టులో ఇండియా 3 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను దక్కించుకుంది. రహానే అద్భుత కెప్టెనీకి తోడు సిరాజ్, శుభమన్ గిల్, రిషభ్ పంత్ అద్భుత ఆటతీరుతో జట్టుకు అసాధారణ విజయం లభించింది. ఈ సిరీస్ చాలా ప్రత్యేకమైనది కావడంతో దీనిపై డాక్యుమెంటరీ కూడా తీశారు.