Gita Press | బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పుస్తక ప్రదర్శనలు.. ఎక్కడో ఓ చోట మనకు గీతాప్రెస్ పుస్తకాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ, మొహం తిప్పేసుకుని ఏ పాపులర్ రచనలనో ఎంచుకుంటాం. నిజానికి గీతాప్రెస్ ప్రచురణలు భారతీయ సంప్రదాయ భాండాగారాలు. ఆ పుస్తకాలను కొనడం అంటే.. వందేండ్ల సంస్థను బతికించుకోవడమే. గాంధీ శాంతి బహుమతికి ఎంపికైన సందర్భంగా గీతాప్రెస్ అక్షర ప్రస్థానం..
శ్రీకృష్ణుడు రథ సారథిగా అర్జునుడు కురుక్షేత్రానికి తరలివెళ్తున్న చిత్రమే ‘గీతా ప్రెస్ గోరఖ్పూర్’ లోగో. దీనిద్వారా, తమ ముద్రణాలయం ఆధునిక యుగంలో సనాతన ధర్మానికి పెద్దపీట వేస్తుందని వ్యవస్థాపకులు చెప్పకనే చెప్పారు. గీతోపాసకుడైన మహాత్ముడు సైతం.. తన ప్రసంగాలలో, రచనలలో పరమాత్మ సందేశాన్ని ప్రపంచానికి అందించారు. కాబట్టే, గీతా ప్రెస్ను గాంధీ శాంతి బహుమతికి ఎంపికచేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. ‘గాంధేయ విధానాల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పునకు దోహదం చేసినందుకు’గాను వివిధ వ్యక్తులకు, సంస్థలకు ఈ పురస్కారం ప్రదానం చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. శతాబ్ది ఉత్సవాల వేళ గీతా ప్రెస్కు ఈ గౌరవం దక్కడం యాదృచ్ఛికం.
వందేండ్ల క్రితం..
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో 1923 ఏప్రిల్ 29న గీతాప్రెస్ ఏర్పాటు చేశారు. జైదయాళ్ గోయెంకా, ఘనశ్యామ్దాస్ జలాన్, హనుమాన్ ప్రసాద్ పోద్దార్ ఈ ముద్రణాలయ వ్యవస్థాపకులు. ‘సనాతన ధర్మ’ ప్రచారమే తమ లక్ష్యమని ఆ ముగ్గురూ ప్రకటించారు. ప్రచురణ సంస్థను స్థాపించిన ఆరు నెలలకే, దాదాపు 600 రూపాయలతో ముద్రణా యంత్రాన్ని కొనుగోలు చేశారు. గీతా ప్రెస్ భాండా గారంలో 3,500కు పైగా రాతప్రతులు ఉన్నాయి. గీతా ప్రెస్ ఇప్పటివరకు 41.7 కోట్లకు పైగా పుస్తకాలను ప్రచురించింది. హిందీతోపాటు మరాఠీ, గుజరాతీ, ఒడియా, సంస్కృతం, తెలుగు, కన్నడ.. మొదలైన భాషల్లో ప్రచురణలు లభిస్తున్నాయి. వీటిలో ఒక్క భగవద్గీతే 16.21 కోట్ల ప్రతులు ముద్రితమైంది. తులసీదాసు రచనలు 11.73 కోట్ల ప్రతులు, పురాణాలు, ఉపనిషత్తులకు సంబంధించిన రచనలు 2.68 కోట్ల ప్రతులు ముద్రించింది గీతా ప్రెస్. ‘ఇదేం గొప్ప రికార్డు కాదు. మా భాగ్యం’ అంటారు నిర్వాహకులు.
విరాళాలు స్వీకరించరు
గాంధీ శాంతి బహుమతి ప్రకటించగానే ప్రశంసా పత్రం, గాంధీ ఫలకం తీసుకుంటాం కానీ, నగదుగా ఇచ్చే కోటి రూపాయలు మాత్రం వద్దని గీతా ప్రెస్ నిర్వాహకులు నిర్మొహమాటంగా ప్రకటించారు. కారణం, గీతాప్రెస్ విరాళాలకు ఆమడ దూరంగా ఉంటుంది. విలువల బాటలో తమదైన ప్రయాణానికి అవరోధాలు లేకుండా.. ఆ సంస్థ తనకంటూ ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనలలో ఇదొకటి. అంతే కాదు, పుస్తకంలో అచ్చేయడానికి వాణిజ్య ప్రకటనలు కూడా స్వీకరించదు. విక్రయాలే సంస్థకు ఆధారం. పుస్తక పఠనం బాగా తగ్గిపోయిన పరిస్థితుల్లోనూ.. తన బాట విడువలేదు. ఓ దశలో ఆర్థిక సంక్షోభం కారణంగా జీతాలు పెంచలేని పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది సమ్మెకు దిగారు కూడా. కార్మికులు, ట్రస్టీలు ఓ దగ్గర కూర్చుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. తొలగించిన ఉద్యోగులకు బకాయిలు ఇచ్చి మరీ తిరిగి పనిలోకి తీసుకున్నారు. గీతా ప్రెస్ చరిత్రలో దాదాపు మూడు వారాలపాటు సమ్మె జరిగిన ఒకే ఒక్క సందర్భం ఇదే.
పత్రిక కూడా
గీతా ప్రెస్ ప్రధానంగా శ్రీమద్భవద్గీత, రామచరితమానస్, రామాయణం, మహాభారతం, ఇతర పురాణాలు, ఉపనిషత్తులు మొదలైన హిందూ ధార్మిక సాహిత్యాన్ని ప్రచురిస్తుంది. పిల్లల కోసం 11 కోట్లకు పైగా పుస్తకాలను ముద్రించింది. పుస్తకలతోపాటు ‘కల్యాణ్’ అనే మాసపత్రిక కూడా గీతా ప్రెస్ నుంచి వెలువడుతున్నది. ఇందులో ఆధ్యాత్మికత, విజ్ఞానం, యోగ తదితర ధార్మిక సంబంధ అంశాలకు చోటు ఉంటుంది. ఏటా ఏదో ఒక ప్రత్యేక అంశం మీదో.. మంచి పుస్తకం గురించో ప్రత్యేక సంచికను ప్రచురిస్తుంది. న్యూస్ ప్రింట్ ఖరీదైన వ్యవహారంగా మారినా.. గీతాప్రెస్ పుస్తకాల ధరలు మాత్రం అందుబాటులోనే ఉంటాయి. ప్రామాణికతలో తిరుగులేదు.
గాంధీ శాంతి బహుమతి
కేంద్ర ప్రభుత్వం 1995 నుంచి గాంధీ శాంతి బహుమతిని ఇస్తున్నది. మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రచారం కోసం ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. దీనిని అందుకునేవాళ్లు భారతీయులు, భారతీయ సంస్థలే కావాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎవరికైనా, ఏ సంస్థకైనా ప్రకటించవచ్చు. ఈ అవార్డు కింద కోటి రూపాయల నగదు, ప్రశంసాపత్రం, గాంధీజీ ఫలకం ప్రదానం చేస్తారు. తొలి అవార్డు టాంజానియా నాయకుడు జూలియస్ నెరేరే, రెండోది శ్రీలంకలో సర్వోదయ ఉద్యమ వ్యవస్థాపకుడు ఏటీ అరియరత్నే, మూడోది జర్మన్ దౌత్యవేత్త గెరార్డ్ ఫిషర్, డెస్మండ్ టుటు, నెల్సన్ మండేలా లాంటి విదేశీ ప్రముఖులకు గాంధీ శాంతి బహుమతి ప్రకటించారు. ఇస్రో, రామకృష్ణ మిషన్, బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్, వివేకానంద కేంద్ర, అక్షయపాత్ర, సులభ్ ఇంటర్నేషనల్ లాంటివి గీతా ప్రెస్కు ముందు గాంధీ శాంతి బహుమతి స్వీకరించిన సంస్థలు. 2019లో ఒమన్ సుల్తాన్ ఖాబూస్ బిన్ సయీద్ అల్ సయీద్ అందుకున్నారు. 2020లో బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడు, బంగబంధు షేక్ ముజీబుర్ రహ్మాన్కు మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించారు.