ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
లింబా(కే)లో బీరప్ప ఆలయంలో పూజలు
కుంటాల, ఏప్రిల్ 2 : నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి దశల వారీగా కృషి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి పేర్కొన్నారు. కుంటాల మండలం లింబా(కే) గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన బీరప్ప ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని గొంగడితో కురుమ సంఘం నాయకులు సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కురుమ కులస్తుల సంక్షేమానికి మునుపెన్నడూ లేని విధంగా చేయూతనిస్తున్నదని తెలిపారు. వంద శాతం రాయితీపై గొర్రెలను అందించి ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. కుంటాల మండలంలో పురాతన ఆలయాల అభివృద్ధితో పాటు, నూతన ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల సహకారంతో ఆలయాలను అభివృద్ధి చేసి, భక్తులకు వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ సవ్వి అశోక్ రెడ్డి, సర్పంచ్ ఆనంద్రావ్ పటేల్ ఎంపీటీసీ సత్యం గిరీశ్, ఉప సర్పంచ్ ముత్యం రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఏనుగు శ్రీకర్ రెడ్డి, కురుమ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.