కేప్టౌన్: మహిళల టీ20 వరల్డ్కప్(Womens T20 Worldcup)లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో ఇండియా మహిళల జట్టు అయిదు పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే రసవత్తరంగా సాగిన ఆ మ్యాచ్లో ఓ దురదృష్టకర సంఘటన జరిగింది. భారత్ను విజయతీరాల వైపు తీసుకువెళ్తున్న హర్మన్ప్రీత్(Harmanpreet Kaur).. అత్యంత కీలకమైన దశలో రనౌట్ అయ్యింది. జార్జియా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో రెండో పరుగుకు ప్రయత్నించిన కౌర్ను మూనీ సూపర్త్రోతో కీపర్ హీలీ రనౌట్ చేసింది.
— Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) February 23, 2023
నిజానికి హర్మన్ ఆ బంతికి తొలి రన్ ఈజీగా తీసేసింది. అయితే రెండో రన్ తీస్తూ దాదాపు క్రీజ్ వద్దకు చేరుకున్నది. కానీ క్రీజ్కు ముందే హర్మన్ బ్యాట్ పిచ్పై తట్టుకున్నది. ఆ బ్యాట్ను క్రీజ్లోకి లాగేలోపే.. కీపర్ హీలీ రనౌట్ చేసేసింది. దీంతో హర్మన్ 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటైంది. ఆ ఆవేశంలో డగౌట్ వైపు వెళ్తూ.. హర్మన్ తన బ్యాట్ను విసిరేసింది. స్టాండ్స్లో ఉన్న ఇండియన్ ప్లేయర్లు కూడా హర్మన్ రనౌట్ కావడంతో షాక్లోకి వెళ్లిపోయారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. బెత్ మూనీ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో రాణించగా.. కెప్టెన్ మెగ్ లానింగ్ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో అదరగొట్టింది. అలీసా హీలీ (25), ఆష్లే గార్డ్నర్ (18 బంతుల్లో 31; 5 ఫోర్లు) కూడా రాణించడంతో ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది.
భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, దీప్తి శర్మ, రాధ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. టోర్నీ ఆసాంతం రాణించిన పేసర్ రేణుక సింగ్ కీలక పోరులో భారీగా పరుగులు సమర్పించుకోవడం భారత్ కొంపముంచింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన హర్మన్ప్రీత్ బృందం 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ హర్మన్ (34 బంతుల్లో 52; 6 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో పోరాడగా.. రోడ్రిగ్స్ (24 బంతుల్లో 43; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు కంగారూలను చితక్కొట్టింది. చివర్లో దీప్తి శర్మ (20 నాటౌట్; 2 ఫోర్లు) పోరాటం కొనసాగించినా.. భారత జట్టుకు పరాజయం తప్పలేదు.