ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా మహిళా క్రికెటర్లు అద్భుతం చేశారు. ఈ శతాబ్దంలో తొలిసారి ఇంగ్లండ్ను వన్డేలలో వారి గడ్డ మీదే ఓడించి సిరీస్ కైవసం చేసుకుని నయా చరిత్ర సృష్టించారు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా కాంటర్బ్యూరీలో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (111 బంతుల్లో 143 నాటౌట్, 18 ఫోర్లు, 4 సిక్స్లు) శతకానికి తోడు యువ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ (4/57) స్వింగ్కు ఇంగ్లండ్ కుదేలైంది. భారత్ నిర్దేశించిన 334 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 245 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా భారత్ 88 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ఇండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో హర్మన్ప్రీత్ సెంచరీకి తోడు స్మృతి మంధాన (40), హర్లీన్ డియోల్ (58) రాణించారు. 99కే మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన హర్మన్.. హర్లీన్ తో కలిసి నాలుగో వికెట్కు 113 పరుగులు జోడించింది. సెంచరీ తర్వాత తాను ఆడిన చివరి 11 బంతుల్లో ఆమె వరుసగా.. 6, 4, 4, 6, 4, 1, 6, 4, 4, 4, 0 తో రెచ్చిపోయింది. ఫలితంగా భారత్.. ఇంగ్లండ్ ముందు 334 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్కు రేణుకా సింగ్ చుక్కలు చూపెట్టింది. ఓపెనర్ ట్యామీ బ్యూమంట్ (6) రనౌట్ కాగా ఎమ్మా లంబా (15), వన్ డౌన్ బ్యాటర్ సోఫియా డంక్లీ (1) ని రేణుకా పెవిలియన్ పంపింది. ఆ తర్వాత వచ్చిన అలిస్ క్యాప్సే (39), వ్యాట్ (65), కెప్టెన్ అమీ జోన్స్ (39) కాసేపు ప్రతిఘటించారు. అయితే వ్యాట్ను రేణుకా బౌల్డ్ చేయగా.. అమీ జోన్స్ను హేమలత పెవిలియన్ పంపడంతో ఇంగ్లండ్ లక్ష్యం మీద ఆశలు వదులుకుంది. చివరికి 44.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇక ఇంగ్లండ్లో భారత మహిళా జట్టుకు 23 ఏండ్ల తర్వాత ఇదే తొలి వన్డే సిరీస్. అంతకుముందు 1999లో వన్డే సిరీస్ నెగ్గిన తర్వాత మళ్లీ భారత్.. ఈ రెండు దశాబ్దాలలో అక్కడికి వెళ్లడం, ఉత్తచేతులతోనే తిరిగిరావడం జరిగేది. కానీ హర్మన్ప్రీత్ సేన మాత్రం.. తొలి వన్డేలో గెలిచి సిరీస్లో ఆధిక్యం సాధించింది. తాజాగా రెండో వన్డే కూడా గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. మూడు వన్డేలలో భాగంగా ఆఖరి మ్యాచ్.. ఈ నెల 24న లార్డ్స్లో జరుగుతుంది. భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామికి ఇదే ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం.
Captain @ImHarmanpreet led from the front, hammering 143* & bagged the Player of the Match award as #TeamIndia beat England by 88 runs in the 2⃣nd ODI to take an unassailable lead in the series. 👏 👏 #ENGvIND
Scorecard ▶️ https://t.co/dmQVpiNH4h pic.twitter.com/lHrfOQDBX7
— BCCI Women (@BCCIWomen) September 21, 2022