Beth Mooney : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు పెద్ద షాక్. కెప్టెన్ బేత్ మూనీ టోర్నీకి దూరం కానుంది. లీగ్ ప్రారంభ మ్యాచ్లో గాయడిన ఆమె కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. దాంతో టోర్నీ నుంచి తప్పుకోనుంది. ఈ వికెట్ కీపర్, బ్యాటర్ స్థానంలో లారా వొల్వార్డ్త్( దక్షిణాఫ్రికా)ను గుజరాత్ యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆమె రెండు ఎగ్జిబిషన్ మ్యాచ్ల కోసం పాకిస్థాన్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్లో శనివారం (మార్చి 11న) జరిగే మ్యాచ్కు ఆమె జట్టుతో కలవనుంది.
డబ్ల్యూపీఎల్ ఆరంభ మ్యాచ్లో మూనీ తొలి ఓవర్లోనే రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది. చీలమండకు గాయం కావడంతో ఆమె నొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడింది. అయితే.. గుజరాత్ ఆఖరి వికెట్గా ఆమె బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా లేకపోవడంతో అంపైర్లు ముంబై ఇండియన్స్ని విజేతగా ప్రకటించారు. ‘డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. అయితే.. నేను మైదానంలో దిగకున్నా.. జట్టు ప్రదర్శనను నిత్యం గమనిస్తూనే ఉంటాను. వచ్చే సీజన్కు మరింత స్ట్రాంగ్గా, ఫిట్గా తయారై వస్తాను. గుజరాత్ జెయింట్స్ బృందానికి ఆల్ ది బెస్ట్’ అని మూనీ వెల్లడించింది.
మూనీ టోర్నమెంట్ మొత్తానికి దూరం కానుండడతో వైస్ కెప్టెన్గా ఉన్న స్నేహ్ రానాను ఫ్రాంఛైజీ పూర్తి స్థాయి కెప్టెన్ చేసింది. గాయం తగ్గకపోవడంతో యూపీ వారియర్స్తో జరిగిన రెండో మ్యాచ్లోనూ మూనీ ఆడలేదు. దాంతో, యూపీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లకు స్నేహ్ రానా కెప్టెన్గా వ్యవహరించింది. ఆర్సీబీపై 11 పరుగుల తేడాతో గుజరాత్ గెలిచింది. ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ చేతిలో ఓడిపోయిన ఆ జట్టు ఈ లీగ్లో తొలి విజయం నమోదు చేసింది.
దక్షిణాఫ్రికాలో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్లో మూనీ అదరగొట్టింది. ఫైనల్లో సఫారీ జట్టుపై అర్ధ శతకంతో మెరిసింది. దాంతో, ఆస్ట్రేలియా పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆరోసారి పొట్టి ప్రపంచకప్ విజేతగా అవతరించింది. అంతేకాదు టీ20 వరల్డ్కప్ను వరుసగా రెండోసారి హ్యాట్రిక్ కొట్టిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ను రూ.2 కోట్ల భారీ ధరకు గుజరాత్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆమెకే సారథ్య బాధ్యతలు అప్పగించింది. రూ.30 లక్షల కనీస ధర ఉన్న లారాను వేలంలో ఏ జట్టు కొనేందుకు ఆసక్తి చూపించలేదు. ఫామ్లో ఉన్న ఆమె టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లండ్పై 53, ఫైనల్లో ఆసీస్పై 61 రన్స్ చేసింది.