గుజరాత్ టైటాన్స్ టాప్ గేర్లో దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నది. సొంత ఇలాఖాలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఘన విజయం సాధించింది. సాయి సుదర్శన్ సమయోచిత అర్ధసెంచరీతో భారీ స్కోరు అందుకున్న టైటాన్స్…రాజస్థాన్ను కట్టడి చేయడంలో సఫలమైంది. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ రాణించడంతో రాయల్స్ ఓటమివైపు నిలిచింది.
IPL | అహ్మదాబాద్: ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయం సాధించింది. తొలుత సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82, 8ఫోర్లు, 3సిక్స్లు) అర్ధసెంచరీకి తోడు బట్లర్ (36), షారుఖ్ఖాన్(36) రాణించడంతో టైటాన్స్ 20 ఓవర్లలో 217/6 స్కోరు చేసింది. తుషార్ (2/53), తీక్షణ (2/54) రెండేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ 159 స్కోరుకు పరిమితమైంది. హెట్మైర్(32 బంతుల్లో 52, 4ఫోర్లు, 3సిక్స్లు), శాంసన్(41) రాణించినా లాభం లేకపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ (3/24), సాయి కిషోర్(2/20).. రాయల్స్ను దెబ్బతీశారు.
సూపర్ సుదర్శన్
ఐపీఎల్లో తన అరంగేట్రం (2022) నుంచి నిలకడగా ఆడుతూ గుజరాత్ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుదర్శన్.. మరోసారి నిలకడను చాటుకున్నాడు. అహ్మదాబాద్లో మ్యాచ్ అంటేనే చెలరేగే (ఇక్కడ ఆడిన 15 ఇన్నింగ్స్లలో అతడు 58.71 సగటుతో 822 పరుగులు చేశాడు) అతడు.. రాజస్థాన్తో పోరులోనూ చెలరేగాడు. జోఫ్రా ఆర్చర్ కొత్త బంతితో నిప్పులు చెరగడంతో మూడో ఓవర్లోనే టైటాన్స్.. గిల్ (2) వికెట్ను కోల్పోయినా బట్లర్ (25 బంతుల్లో 36, 5 ఫోర్లు), షారుఖ్ ఖాన్ (20 బంతుల్లో 36, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అండతో అతడు గుజరాత్ను పటిష్ట స్థితిలో నిలిపాడు. తుషార్ 5వ ఓవర్లో ఫైన్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ బాదిన సుదర్శన్.. అదే ఓవర్లో మరో రెండు బౌండరీలు రాబట్టాడు. బట్లర్ కూడా ఫజల్హక్, తీక్షణ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టాడు. తీక్షణ పదో ఓవర్లో సింగిల్తో 32 బంతులో సాయి అర్ధశతకం పూర్తయింది. ఈ సీజన్లో అతడికి ఇది మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం.
కానీ ఇదే ఓవర్లో ఆఖరి బంతికి బట్లర్.. వికెట్ల ముందు దొరికిపోవడంతో 80 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. నాలుగో స్థానానికి ప్రమోట్ అయిన షారుఖ్ సైతం ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. తీక్షణ ఓవర్లో అతడు.. 6, 4, 4 తో అలరించాడు. కానీ అతడే వేసిన 16వ ఓవర్లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా సుదర్శన్ వేగంగా ఆడటంతో టైటాన్స్ స్కోరు పరుగులు పెట్టింది. కానీ తుషార్ 19వ ఓవర్లో.. శాంసన్కు క్యాచ్ ఇవ్వడంతో సుదర్శన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆఖర్లో తెవాటియా (12 బంతుల్లో 24 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులతో రాజస్థాన్ ఎదుట టైటాన్స్ భారీ లక్ష్యాన్ని నిలిపింది.
రాయల్స్ ఢమాల్:
ఛేదనను రాజస్థాన్ కూడా దూకుడుగానే ఆరంభించినా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి చతికిలపడింది. రెండు పరుగుల వ్యవధిలోనే జైస్వాల్ (6), రాణా (1) వికెట్లను కోల్పోయినా సారథి శాంసన్, పరాగ్ (14 బంతుల్లో 26, 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. పవర్ ప్లేలో ఈ ఇద్దరూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో 6 ఓవర్లకు ఆ జట్టు 57/2గా నిలిచింది. కానీ బౌలింగ్ మార్పుగా వచ్చిన కెజ్రొలియా.. ఏడో ఓవర్లో పరాగ్ను ఔట్ చేశాడు. మరుసటి ఓవర్లోనే రషీద్ ఖాన్.. జురెల్ (5)నూ పెవిలియన్కు పంపి రాయల్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్మైర్ దూకుడు ప్రదర్శించాడు. శాంసన్ జతగా బౌండరీలతో చెలరేగాడు. ఇద్దరు మంచి టచ్లోకి వచ్చారనుకున్న తరుణంలో శాంసన్ ఔట్ కావడం రాజస్థాన్ అవకాశాలను దెబ్బతీసింది. ఇంప్యాక్ట్ ప్లేయర్గా వచ్చిన శుభమ్ దూబే (1)ను రషీద్ఖాన్ పెవిలియన్ పంపగా, ఆఖరి వరుస బ్యాటర్లతో కలిసి హెట్మైర్ జట్టును గెలిపించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు:గుజరాత్: 20 ఓవర్లలో 217/6 (సుదర్శన్ 82, షారుఖ్ 36, తుషార్ 2/53, తీక్షణ 2/54);
రాజస్థాన్: 19.2 ఓవర్లలో 159 ఆలౌట్(హెట్మైర్ 52, శాంసన్ 41, ప్రసిద్ధ్ కృష్ణ 3/24, సాయికిషోర్ 2/20)