Sunrisers Hyderabad | అహ్మదాబాద్: ఐపీఎల్లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్నది. గెలిస్తే కానీ రేసులో నిలువలేని పరిస్థితుల్లో జట్లు కడదాకా కొట్లాడుతున్నాయి. లీగ్లో తీవ్ర ఒడిదొడుకులతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ తమ అభిమానులను మళ్లీ నిరాశపరిచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో రైజర్స్ 38 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలైంది. గుజరాత్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 186/6 స్కోరుకు పరిమితమైంది. అభిషేక్శర్మ(41 బంతుల్లో 74, 4ఫోర్లు, 6సిక్స్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నా లాభం లేకపోయింది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. శుభ్మన్ గిల్ (38 బంతుల్లో 76, 10 ఫోర్లు, 2 సిక్స్లు), జోస్ బట్లర్ (37 బంతుల్లో 64, 3 ఫోర్లు, 4 సిక్స్లు), సాయి సుదర్శన్ (23 బంతుల్లో 48, 9 ఫోర్లు) దంచేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారీ ఛేదనను సన్రైజర్స్ దూకుడుగానే ఆరంభించింది. ట్రావిషేక్ జోడీ భారీ మెరుపులు మెరిపించకపోయినా వేగంగానే పరుగులు రాబట్టి మంచి ఆరంభాన్నే అందించారు. సిరాజ్ తొలి ఓవర్లో రెండో బంతిని అభిషేక్.. లాంగాఫ్ మీదుగా సిక్స్తో ఛేదనను ప్రారంభించాడు. నాలుగు బౌండరీలతో హెడ్ జోరు మీదే కనిపించాడు. కానీ ప్రసిద్ధ్ బౌలింగ్లో రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్తో అతడు వెనుదిరగాల్సి వచ్చింది. అభిషేక్, ఇషాన్ కిషన్ (13) క్రీజులో ఉన్నా 5-10 ఓవర్ల మధ్య హైదరాబాద్ చేసింది 40 పరుగులే. అభిషేక్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించకపోగా ఇషాన్ వైఫల్యం కొనసాగింది.
కొయెట్జ్ బౌలింగ్లో సిక్సర్తో అభిషేక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఫిఫ్టీ తర్వాత అభిషేక్ గేర్ మార్చినా అప్పటికే ఛేదించాల్సిన రన్రేట్ 15కు పెరిగిపోయింది. క్లాసెన్ కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఆరు ఓవర్లలో హైదరాబాద్ విజయానికి 98 పరుగులు అవసరమవగా.. వెంటవెంటనే వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్తో క్లాసెన్(23), అనికేత్(3), మెండిస్(0) నిరాశపరిచారు. అభిషేక్ ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేక రైజర్స్ ఏడో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
సీజన్ ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తున్న గుజరాత్ టాపార్డర్.. సన్రైజర్స్తోనూ దానిని కొనసాగించింది. టాప్-3 బ్యాటర్లు సాయి, గిల్, బట్లర్ ధాటిగా ఆడటంతో టైటాన్స్ మరోసారి భారీ స్కోరు సాధించింది. ఓపెనింగ్ ద్వయం సాయి, గిల్ తొలి వికెట్కు 6.5 ఓవర్లలోనే 87 పరుగులు జోడించి టైటాన్స్కు మెరుపు ఆరంభాన్ని అందించారు. సాయి అయితే బౌండరీల వర్షం కురిపించాడు. షమీ మూడో ఓవర్లో ఐదు ఫోర్లతో 20 పరుగులు రాబట్టాడు. కమిన్స్ వేసిన మరుసటి ఓవర్లో గిల్.. 4, 4, 6తో విజృంభించడంతో 4 ఓవర్లకే గుజరాత్ స్కోరు ఫిఫ్టీ మార్కును దాటింది.
హర్షల్ ఓవర్లోనూ సుదర్శన్ నాలుగు ఫోర్లు కొట్టాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన అన్సారీ.. 7 ఓవర్లో ఐదో బంతికి సుదర్శన్ను ఔట్ చేయడంతో టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన బట్లర్ కూడా బ్యాట్కు పనిచెప్పడంతో గుజరాత్ స్కోరు ఓవర్కు 12 పరుగులకు తగ్గకుండా దూసుకెళ్లింది. ఈ ఇద్దరూ రెండో వికెట్కు 37 బంతుల్లోనే 62 పరుగులు జోడించారు. షమీ పదో ఓవర్లో ఎక్స్ట్రా కవర్స్ దిశగా బౌండరీతో గిల్ వరుసగా మూడో అర్ధ శతకం సాధించాడు. ఈ సీజన్లో గిల్కు ఇది ఐదో ఫిఫ్టీ. గిల్ రనౌట్ అవడంతో బాదుడు బాధ్యతను బట్లర్ తీసుకున్నాడు. అన్సారీ బౌలింగ్లో 6, 4తో హాఫ్ సెంచరీ చేసిన బట్లర్.. హర్షల్ ఓవర్లో బౌండరీ, సిక్సర్తో టైటాన్స్ స్కోరు 200 పరుగుల మార్కును దాటింది.
గుజరాత్: 20 ఓవర్లలో 224/6 (గిల్ 76, బట్లర్ 64, ఉనద్కత్ 3/35, కమిన్స్ 1/40);
హైదరాబాద్: 20 ఓవర్లలో 186/6 (అభిషేక్ 74, క్లాసెన్ 23, సిరాజ్ 2/33, ప్రసిద్ధ్ కృష్ణ 2/19)