అహ్మదాబాద్: గుజరాత్ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో తెలంగాణ పతక దూకుడు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పోటీ ఏదైనా..పతకం పక్కా అన్న రీతిలో మన రాష్ట్ర ప్లేయర్లు పతకాల పంట పండిస్తున్నారు. పోటీలకు నాలుగో రోజైన సోమవారం తెలంగాణకు రెండు స్వర్ణాలు సహా రజతం, కాంస్య పతకం దక్కాయి. తొలుత మహిళల బాస్కెట్బాల్ 3X3 విభాగంలో తెలంగాణ 17-13 తేడాతో కేరళపై అద్భుత విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో జాతీయస్థాయి టోర్నీల్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న మన అమ్మాయిలు..నేషనల్ గేమ్స్లోనూ సత్తాచాటారు. కేరళ జట్టు నుంచి దీటైన పోటీ ఎదురైనా వెనుకకు తగ్గకుండా పుష్ప(6), అశ్వతి థంపీ(5), అంబరసి(5) మెరుగ్గా రాణించారు. తెలంగాణలో బాస్కెట్బాల్ క్రీడకు ఆదరణ అంతకంతకూ పెరుగుతుందని, పాఠశాల, ఇంటర్ కాలేజ్ టోర్నీల ద్వారా ఆటను మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి నార్మన్ ఇసాక్ పేర్కొన్నారు. రాష్ట్ర జట్టుకు జాతీయ బాస్కెట్బాల్ కోచ్ హైదరాబాదీ సోహైల్ఖాన్ అభినందనలు తెలిపారు.
మన షట్లర్లు అదుర్స్:
నేషనల్ గేమ్స్ బ్యాడ్మింటన్లో తెలంగాణ జట్టు పసిడి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన టీమ్ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ 3-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో సుమిత్, సిక్కిరెడ్డి జోడీ 21-15, 14-21, 21-14తో అర్జున్, త్రిసా జాలీ జోడీపై గెలిచి బోణీ కొట్టింది. ఆది నుంచే తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన సిక్కికి జాతీయ క్రీడల్లో ఇది వరుసగా మూడో స్వర్ణం. పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్ 18-21, 21-16, 22-20తో ప్రణయ్పై గెలిచాడు. మహిళల సింగిల్స్లో సామియా ఇమాద్ ఫారుఖీ 21-15, 21-12తో గౌరికృష్ణపై అలవోకగా గెలిచింది.
రోయింగ్లో కాంస్యం
రోయింగ్ కాక్స్విన్ కేటగిరీలో తెలంగాణ(5:46:8సె)కు కాంస్యం లభించింది. సర్వీసెస్(5:32సె), మధ్యప్రదేశ్(5:46సె) వరుసగా స్వర్ణ, రజతాలు ఖాతాలో వేసుకున్నాయి. ఓవరాల్గా ఇప్పటి వరకు తెలంగాణ 4 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు మొత్తం 12 పతకాలతో 14వ స్థానంలో ఉంది.
వ్రితి వెండి వెలుగులు:
నేషనల్ గేమ్స్లో వ్రితి పతకాల ఖాతా తెరిచింది. సోమవారం జరిగిన మహిళల 800 ఫ్రీైస్టెల్ ఫైనల్ రేసును 9.23 సెకన్లలో ముగించిన వ్రితి రజతం సొంతం చేసుకుంది. భవ్య సచ్దేవ్(ఢిల్లీ, 9.15సె), అశ్మిత చంద్ర(కర్ణాటక, 9.27సె) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.