Glenn McGrath : భారత గడ్డపై మరో రెండు నెలల్లో వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) మొదలవ్వనుంది. దాంతో, అన్ని జట్లు ఇప్పటికే సన్నాహక మ్యాచ్లతో బిజీగా ఉన్నాయి. ఈ మహా సంగ్రామంలో విజేతగా నిలిచే జట్టు ఏది? అని ఇప్పటికే చర్చలు కూడా మొదలయ్యాయి. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్గ్రాత్( Glenn McGrath) సెమీస్ బెర్తులపై జోస్యం చెప్పాడు. భారత్(India), ఆస్ట్రేలియా(Australia), ఇంగ్లండ్(England)తో పాటు పాకిస్థాన్(Pakistan) జట్టు ఈసారి సెమీస్కు చేరుతుందని ఈ మాజీ పేసర్ తెలిపాడు.
‘ఈసారి ఆస్ట్రేలియా టాప్ -4లో ఉంటుందని చెప్పడంలో ఎవరికీ ఆశ్చర్యం కలగదని అనుకుంటున్నా. సొంత గడ్డపై ఆడుతున్న భారత్ అంచనాలకు తగ్గట్టే సెమీస్కు వెళ్తుంది. ఇంగ్లండ్ జట్టు ఈమధ్య గొప్పగా ఆడుతోంది. ఇక పాకిస్థాన్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. నా దృష్టిలో ఈ మెగాటోర్నీలో ఆడుతున్న నాలుగు ఉత్తమ జట్లు ఇవే’అని మెక్గ్రాత్ వెల్లడించాడు. 1999లో, 2003లో వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. ప్రపంచంలోని గొప్ప బౌలర్లలో ఒకడైన మెక్గ్రాత్ 2007లో క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
ప్రపంచ కప్ ట్రోఫీతో గ్లెన్ మెక్గ్రాత్
ఈఏడాది జింబాబ్వే(Zimbabwe) వేదికగా ఈమధ్యే ముగిసిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(ODI World Cup Qualifiers) పోటీల్లో దుమ్మురేపిన శ్రీలంక, నెదర్లాండ్స్ ఆఖరి రెండు బెర్తులు దక్కించుకున్నాయి. దాంతో, టైటిల్ కోసం పది జట్ల మధ్య హోరీహోరీ పోరు ఉండనుంది. వన్డే వరల్డ్ కప్ భారత గడ్డపై అక్టోబర్ 5న మొదలవ్వనుంది.
రోహిత్ శర్మ, బాబర్ ఆజాం
టోర్నీ ఆరంభ మ్యాచ్లో 2019 ఫైనలిస్ట్లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14న జరుగనుంది. నవంబర్ 19న విజేత ఎవరో తేలిపోతుంది. ఈసారి ఫైనల్తో పాటు సెమీఫైనల్స్కు కూడా రిజర్వ్ డేను కేటాయించడం విశేషం.