Kyle Mayers : ప్రపంచంలోని గొప్ప క్రికెటర్లు ఎవరు? అనే ప్రశ్నకు ఎవరైనా విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) పేర్లు చెప్తారు. గత కొన్నాళ్లుగా టీమిండియాకు వెన్నెముకలా నిలుస్తున్న ఈ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అంతేకాదు కోహ్లీ, రోహిత్ వికెట్ తీయడం అనేది ప్రతి బౌలర్ కల. ప్రపంచంలోనే గొప్ప ఆటగాళ్లుగా పేరొందిన వీళ్లలో ఎవరి వికెట్ విలువైనది? అనే ప్రశ్నకు వెస్టిండీస్ ఆల్రౌండర్ కిలీ మేయర్స్(Kyle Mayers) ఏం చెప్పాడో తెలుసా..?
రోహిత్ కంటే విరాట్ కోహ్లీ వికెట్ ఎంతో విలువైనది అని అన్నాడు. తన సమాధానానికి వివరణ కూడా ఇచ్చాడు. ‘ప్రతి బౌలర్ కోహ్లీని ఔట్ చేయాలనుకుంటాడు. అతను మూడు ఫార్మాట్లలో గొప్ప ప్లేయర్. అందుకని నా ఓటు కోహ్లీ వికెట్కే అని మేయర్స్ తెలిపాడు. అంతేకాదు మైదానంలో విరాట్ దూకుడు గురించి అడుగగా..
కిలీ మేయర్స్
మ్యాచ్ సమయంలో ప్రత్యర్థిని ఓడించేందుకు, మ్యాచ్ గెలిచేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదు. హద్దులు మీరకుండా దూకుడు ప్రదర్శించడం, జట్టును గెలిపించడం అనేది చాలా గొప్ప విషయం’ అని ఈ ఆల్రౌండర్ చెప్పాడు. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో మేయర్స్ సంచలన ఆటతో అదరగొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ఓపెనర్గా ధనాధాన్ ఇన్నింగ్స్లతో శుభారంభాలు ఇచ్చాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. రెండు టెస్టుల సిరీస్ను 1-0తో సొంతం చేసుకుంది. టీమిండియా విండీస్పై రెండో టెస్టుతో కోహ్లీ 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ సెంచరీ సాధించాడు. దాంతో, ఐదొందల మ్యాచ్లో వంద కొట్టిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు.
విరాట్ కోహ్లీ
వన్డే సిరీస్కు ఎంపికైన కోహ్లీ, రోహిత్ యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బెంచ్కే పరిమితమయ్యారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ భారత్ 2-1తో మూడు వన్డేల సిరీస్ దక్కించుకుంది. ఆ వెంటనే మొదలైన టీ20 సిరీస్లో భారత జట్టు 4 పరుగుల తేడాతో ఓడింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 ఆగస్టు 6న జరుగనుంది.