Gautam Gambhir : పొట్టి ఫార్మాట్ రాకతో వన్డేలు కళ తప్పినట్టు అనిపిస్తున్నాయి. టీ20ల్లో పవర్ హిట్లర్లు దంచికొడుతుండడంతో బౌలర్లు ప్రేక్షకుల్లా మారిపోతున్నారు. ఇక ఐపీఎల్లో ‘ఇంప్యాక్ట్ ప్లేయర్'(Impact Player) అనే కొత్త రూల్ వచ్చాక టీ20లు మాత్రమే చూసేవాళ్ల సంఖ్య పెరిగిపోయింది. అందుకు సాక్ష్యంగా.. వన్డే వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో కొన్ని మ్యాచ్లకు అభిమానులు రాక స్టేడియాలు వెలవెలబోయాయి.. ఈ నేపథ్యంలో 50 ఓవర్ల ఆటను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు మాజీ క్రికెటర్లు పలువురు ఎన్నో సలహాలు ఇస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్(Gautam Gambhir) పలు ఆసక్తికర మార్పులు సూచించాడు.
గంభీర్ సూచించిన ప్రధాన మార్పులు ఏవంటే..? ఒక ఇన్నింగ్స్ ఆరంభంలో రెండు కొత్త బంతుల్ని తీసుకోవాలి. 20 ఓవర్ల తర్వాత వాటిలో ఒక దాన్ని పక్కన పెట్టాలి. అంతేకాదు పవర్ ప్లేను బట్టి 30 అడుగుల వలయంలో ఉండే ఫీల్డర్ల సంఖ్య మారుతుండాలి. మొదటి పవర్ ప్లే(1-10 ఓవర్ల మధ్య)లో 30 అడుగుల వలయంలో 9 మంది ఫీల్డర్లను ఉంచాలి. 11- 30 ఓవర్ల మధ్య ఐదుగురు, 31- 40 మధ్య నలుగురు, 41-50 ఓవర్ల మధ్య ముగ్గురు ఫీల్డర్లు 30 అడుగుల వలయంలో ఉండాలి.
ఈ మార్పులను వన్డేల్లో ప్రవేశపెడితే ఆట మరింత మజాగా ఉంటుందనేది గౌతీ అభిప్రాయం. ఐపీఎల్లో ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చాక ఆట మరింత కొత్తగా అనిపించింది. 16వ సీజన్లో తెచ్చిన ఈ కొత్త రూల్ ప్రకారం.. జట్టు అవసరాన్ని బట్టి స్పెషలిస్ట్ బ్యాటర్, బౌలర్ను ఆడించే వీలుంది. అయితే.. ఈ నియమం కారణంగా ఆల్రౌండర్లు నష్టపోయారు. తుది జట్టులో చోటు దక్కకపోవడంతో చాలామంది బెంచ్కే పరిమితమయ్యారు.