Gautam Gambhir : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్కు ముందు భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ (Gautam Gambhir) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఎంపీగా కొనసాగుతున్న అతడు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేయడం లేదని తెలిపాడు. శనివారం గౌతీ ఎక్స్ వేదికగా తనను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని బీజేపీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశాడు.
‘నన్ను రాజకీయ విధుల నుంచి తప్పించాలని గౌరవనీయులైన జేపీ నడ్డాను కోరుతున్నా. ఇకపై నేను క్రికెట్పై పూర్తిగా దృష్టి సారించాలనుకుంటున్నా. ఎంపీగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. జై హింద్’ అని గంభీర్ తన పోస్ట్లో రాసుకొచ్చాడు.
I have requested Hon’ble Party President @JPNadda ji to relieve me of my political duties so that I can focus on my upcoming cricket commitments. I sincerely thank Hon’ble PM @narendramodi ji and Hon’ble HM @AmitShah ji for giving me the opportunity to serve the people. Jai Hind!
— Gautam Gambhir (@GautamGambhir) March 2, 2024
గంభీర్ 2019లో ఉత్తర ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలుపొందాడు. అప్పటి నుంచి ఎంపీగా, క్రికెట్ కోచ్గా కొనసాగాడు. అంతేకాదు లెజెండ్స్ క్రికెట్ లీగ్(Legends Cricket League)లో ఆడడమే కాకుండా స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్గా విధులు నిర్వర్తించాడు. అయితే.. ఎంపీగా ఉన్న సమయంలో రాజకీయాల కంటే క్రికెట్పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడనే విమర్శలు గంభీర్ ఎదుర్కొన్నాడు.
ఐపీఎల్ ట్రోఫీతో గంభీర్ బృందం
పైగా ఈసారి ఎన్నికల టైమ్లోనే ఐపీఎల్ 17వ సీజన్ జరుగనుంది. అందుకనే గౌతీ పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కోల్కతా మాజీ కెప్టెన్ అయిన గౌతీ.. ఆ జట్టును రెండు సార్లు చాంపియన్గా నిలిపాడు. ఈ విధ్వంసక ఓపెనర్ సారథ్యంలో కోల్కతా 2012, 2014లో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
ఐపీఎల్ 17వ సీజన్కు ముందు గంభీర్ సొంత గూటికి చేరాడు. లక్నో సూపర్ జెయింట్స్(LSG) మెంటార్గా ఉన్న గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా బాధ్యతలు చేపట్టాడు. గంభీర్ తర్వాత ప్యాట్ కమిన్స్, ఇయాన్ మోర్గాన్, శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రానా.. ఇలా కెప్టెన్లు మారారు. కానీ, కోల్కతా రాత మారలేదు. దాంతో, కోల్కతా యాజమాన్యం మళ్లీ గంభీర్ను సంప్రతించింది. ఇంకేం అతడు ఓకే చెప్పేశాడు. పదహారు సీజన్లుగా ఫ్యాన్స్ను అలరిస్తున్న ఐపీఎల్ మార్చి 22న షురూ కానుంది. కోల్కతా తమ తొలి మ్యాచ్లో మార్చి 23న సన్రైజర్స్ హైదరాబాద్(SRH)ను ఢీకొననుంది.