Rameshwaram Cafe Blast | కర్ణాటక బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ కేసులో పోలీసు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బృందం కేసును దర్యాప్తు చేస్తుందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. బృందం ధార్వాడ్, హుబ్లీ, బెంగళూరుకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రామేశ్వర్ కేఫ్లో జరిగిన ఐఈడీ పేలుడు ఘటనపై దర్యాప్తు వేగంగా కొనసాగుతుందని బెంగళూరు నగర కమిషనర్ బీ దయానంద్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసు బృందాలు రంగంలోకి విచారణ జరుపగా.. పలు ఆధారాలు లభించాయి.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు ఘటనలో పంది మంది గాయపడ్డ విషయం తెలిసిందే. పేలుడు ఘటనపై బెంగళూరు కమిషనర్ పలు కీలక సూచనలు చేశారు. కేసు సున్నితత్వం, భద్రతా సమస్యలను దృష్టిలో పెట్టుకొని మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి బెంగళూరు పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు.